పేదల చిరకాల కల.. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సొంతింటి కల నెరవేరుతున్నది. ఇల్లులేని వారి కోసం రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘డబుల్’ బెడ్రూం ఇండ్ల పథకం పెద్దపల్లి జిల్లాలో వేగం పుంజుకున్నది. ఆధునిక హంగులతో డిజైన్లు, సువిశాలమైన గదులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా పెద్దపల్లి, మంథని, రామగుండంలో 1,512 గృహాల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే మంథనిలో 74 ఇండ్లను లబ్ధిదారులకు అందించిన యంత్రాంగం, ఇప్పుడు కొత్తగా సిద్ధమైన ఇండ్లను అందించేందుకు కసరత్తు చేస్తున్నది. కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తుండగా, ఉగాది కల్లా పేదలతో గృహప్రవేశాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
పెద్దపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు మొత్తం 3,316 ఇండ్లు మంజూరు చేయగా, ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో ఇండ్లను పంపిణీ చేయగా, మరో 1,512 ఇండ్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను స్వీకరించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 759 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అందులో 744ఇండ్లు నిర్మాణం పూర్తి చేశారు. మరో 15ఇండ్లు వివిధ దశల్లో ఉన్నా యి. అందులో పెద్దపల్లి మండలం హన్మంతునిపేట (రాంపల్లి)లో 160 ఇండ్లు, పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లిలో 200 ఇండ్లు, కాల్వశ్రీరాంపూర్లో 240డబుల్ ఇండ్లు, ఓదెల మండలంలో 144 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. హన్మంతుడిపేట వద్ద ఇప్పటికే కూనారం ఆర్వోబీ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.
ఇక పెద్దపల్లి – కాల్వశ్రీరాంపూర్ మండలాలను కలుపుతూ ఇప్పటికే ఫోర్లైన్ రోడ్డు పూర్తయి పట్టణ వాతావరణం కనిపిస్తున్నది. తాజాగా రాంపల్లి వద్ద సర్వాంగ సుందరంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలు గేటెడ్ కమ్యూనిటీ హౌస్లను తలపిస్తున్నాయి. గతంలో నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతం ఇటు ఆర్వోబీ అటు ఫోర్ లైన్ లింకు రోడ్డుతో ప్రధాన కూడలిని తలపిస్తున్నది. ఇక శ్రీరాంపూర్ మండలం పాండవుల గుట్ట సమీపంలో ఒకే ఒక్క పోలీస్ స్టేషన్, జగత్ మహామునీశ్వరస్వామి ఆలయం మాత్రమే ఉండేది. ఇప్పుడు 240 ఇండ్లు పూర్తి కావడంతో మండల కేంద్ర రూపురేఖలే మారిపోయాయి. ఒక వైపు కస్తూర్బా గాంధీ పాఠశాల, మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాల, పక్కన మార్కెట్ యార్డు ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హులకు ఇండ్లు కేటాయించనున్నారు.
మంథనిలో 74 ఇండ్ల పంపిణీ
మంథని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడలో 92 ఇండ్లను జీప్లస్ పద్ధతిలో నిర్మించారు. అందులో గతంలోనే 74 ఇండ్లు పూర్తికాగా, గత జనవరి 23న మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మిగిలిన 18 ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.
వచ్చే ఉగాది నాటికి పంపిణీ
జిల్లాలో మొత్తంగా 1512 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తికాగా, లబ్ధిదారుల ఎంపిక శరవేగంగా సాగుతున్నది. వచ్చే ఉగాది నాటికి పంపిణీ చేయాలని కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. డబుల్ ఇండ్లకు పంచాయతీరాజ్, సోషల్ వెల్ఫేర్, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. మరోవైపు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
రామగుండంలో 765 ఇండ్లు
రామగుండం నియోజకవర్గంలోని 765 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అందులో అంతర్గాం మండల కేంద్రంలో పీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే 60 గృహాల నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధమయ్యాయి. ఇక ఎన్టీపీసీ టౌన్ షిప్కు దగ్గరగా మల్కాపూర్ పరిధిలోని 3,5వ డివిజన్ల పరిధిలో 675 గృహాలు పూర్తయ్యాయి. ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఈ మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. పంపిణీ ప్రక్రియ పూర్తయితే ఈ ప్రాంతంలో మరింత జన సందడి నెలకొననుంది. ఇక పాలకుర్తి మండలం పుట్నూర్లో 30 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.