Chigurumamidi | చిగురుమామిడి, జూలై 4 : చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు పత్తి విత్తనాలను తీసుకెళ్లారు. ఎకరానికి నాలుగు పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులకు అందజేశారు. రెండు ఎకరాలకు మించి పత్తి విత్తనాల ప్యాకెట్లు ఇవ్వడం లేదన్నారు.
ఆసక్తిగల రైతులు ఆధార్ కార్డు, పాస్ బుక్ జిరాక్స్ కాఫీతో రైతు వేదికకు వచ్చినట్లయితే ఉచితంగా విత్తనాలను ఇవ్వనున్నట్లు ఏవో పున్నం చందర్ తెలిపారు. పత్తి సాగులో అధిక సాంద్రత పద్ధతి, సింగిల్ పీకింగ్ అనేది తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే సరికొత్త విప్లవాత్మక విధానం వ్యవసాయ రంగంలో వచ్చినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)లు అఖిల, సౌమ్య, సతీష్, ప్రణయ్, రాకేష్, ఖలీల్ వివిధ పార్టీల నాయకులు అందే సురేష్ తదితరులు పాల్గొన్నారు.