మహాశివరాత్రి జాతర కోసం వేములవాడ వచ్చిన రాజన్న భక్తులు ఆదివారం తిరుగుముఖం పట్టారు. ‘మా పిల్లాజెల్లాను సల్లంగ సూడు.. వచ్చే ఏడాది మళ్లస్తం రాజన్నా’ అంటూ ఆలయ ముఖద్వారం ముందు దండాలు పెట్టి, వెనుదిరిగారు. దీంతో ఆలయ వీధులు బోసి పోయాయి. కాగా, శివరాత్రి సందర్భంగా ఒక్కరోజులోనే రాజన్నకు రూ.60 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
– వేములవాడ టౌన్, ఫిబ్రవరి 19
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 19 : ఎంతో భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి జాతరకు వచ్చిన రాజన్న భక్తులు ఆదివారం తిరుగుముఖం పట్టారు. వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి జాతర ముగియడంతో ముల్లెమూటా సర్దుకొని పిల్లాజెల్లాను ‘సల్లంగ సూడు రాజన్నా.. ఎల్లొస్తం .. వచ్చే ఏడాది మల్లొస్తం’.. అంటూ రాజన్న ముఖద్వారం ముందు దండాలు పెడ్తూ తిరుగుముఖం పట్టారు. మహా శివరాత్రి పర్వదినాన రాజన్నను కనులనిండా చూసుకుని, రాత్రి జాగరం చేసామని, అందరినీ సల్లంగ సూడు అని మొక్కుకున్నామని భక్తులు అంటున్నారు.
జాతరకు దాదాపు లక్షయాభైవేల మందితో కిటకిటలాడిన ఎములాడ వీధులన్నీ ఆదివారం సాయంత్రం కల్లా భక్తుల తిరుగు ప్రయాణాలతో వెలవెలబోయాయి. జాతర ప్రశాంతంగా ముగియడంతో ఆలయ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పోలీస్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక్కరోజే రాజన్నకు భక్తుల వివిధ టికెట్ల సేవల ద్వారా రూ.60 లక్షలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.