సర్కారు చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ నెలనెలా నిధుల వరద పారుతుండడంతో పట్టణాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పారిశుధ్యం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తుండడంతో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. వెరసీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.
-కార్పొరేషన్, జూన్ 15
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు. దీంతో ఒక్కో సమస్య పరిష్కారానికి ఏండ్లకాలం పట్టేది. ఈ పరిస్థితుల్లో నాలుగేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం అంకురార్పణ చేసిన పట్టణ ప్రగతి అభివృద్ధికి దిక్సూచిలా మారింది. ఇప్పుడు ప్రతినెలా ఠంఛన్గా నిధులు విడుదల చేస్తుండడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా గతానికి భిన్నంగా ప్రజలు సైతం పన్నులు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. ఈ క్రమంలో అనేక మున్సిపాలిటీలు, కరీంనగర్లో దాదాపు వంద శాతం పన్నులు వసూలవుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం సైతం పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నది. దీంతో ప్రజలకు వసతుల కల్పన వేగంగా సాగుతున్నది.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్కు రూ. 2.40 కోట్లు, హుజూరాబాద్కు రూ. 40 లక్షలకు పైగా, జమ్మికుంటకు రూ. 45 లక్షలకు పైగా, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీకు రూ.4 లక్షలకు పైగానే నిధులు వస్తున్నాయి. ఈ నిధులతో ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు ఆహ్లాదకరమైన వాతవరణం కల్పనకు చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పార్కుల అభివృద్ధ్ది, అధునాతన టాయ్లెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించారు. వీటితో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం అన్ని మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్స్, పార్కులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లోనూ వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్ కనిపిస్తున్నాయి. హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలు స్థానికంగా మున్సిపాలిటీ నుంచే వచ్చే విధంగా నర్సరీలను కూడ సిద్ధం చేశారు. పిల్లల ఆటల కోసం క్రీడ ప్రాంగణాలు, పారిశుధ్యం మెరుగుకోసం యంత్రాల కోనుగోలు చేశారు. వీటితో పాటుగా ప్రతి పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థకు పట్టణ ప్రగతి కింద ఇప్పటికే రూ.72 కోట్ల మేరకు నిధులు మంజూరు కాగా రూ. 50 కోట్లను ఖర్చుపెట్టారు. కాగా రూ.22 కోట్లకు సంబంధించి పనులు కొనసాగుతుండగా. . . మరి కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి. ఈ నిధుల నుంచి రూ. 2 కోట్లతో 15 మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్, రూ.3.70 కోట్లతో 30 ఒపెన్ జిమ్స్, రూ.1.3 కోట్లతో 11 వాకింగ్ ట్రాక్స్, రూ.3.10 కోట్లతో 13 పార్కులు, రూ. 6.70 కోట్లతో 16 వైకుంఠధామాలు, రూ. కోటితో క్రీడా ప్రాంగణాలు, రూ. 6.20 కోట్లతో 2 ట్రీ పార్క్, రూ.3.20 కోట్లతో 7 పారిశుద్ధ్య వాహనాలు, రూ. 68 లక్షలతో 39 మిని హైమాస్ట్ లైట్లు, రూ. 6.35 కోట్లతో 27 పారిశుధ్య నిర్వహణ పరికరాలు రూ. 15 కోట్లతో రెండు సమీకృత మార్కెట్లు, రూ.5 కోట్లతో అమృత హర్షిణి హాల్ నిర్మాణం జరుగుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.32 కోట్ల మేరకు వచ్చాయి. అలాగే మిషన్ భగీరథ కింద రూ.110 కోట్ల వ్యయం చేసి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది హరిత హారం కింద 2.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో 32 పారిశుద్ధ్య ట్రాక్టర్లు, 4 ఇతర అవసరాల కోసం ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. 60 స్వచ్చ ఆటోలు కూడ పని చేస్తున్నాయి. ప్రతి ఏటా 86 కోట్ల మేరకు జనరల్ ఫండ్ నిధులతో పనులు సాగుతున్నాయి. నగరంలో అన్ని డివిజన్లల్లోనూ 90 శాతం మేరకు సీసీ రోడ్లు, మురికికాల్వ నిర్మాణాన్ని చేపట్టారు.
హుజూరాబాద్ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూ.11.85 కోట్లు రాగా రూ.10.94 కోట్లు ఖర్చుచేశారు. రూ.4.03 కోట్లతో వీధిదీపాలు ఏర్పాటు చేశారు. రూ.40.58 లక్షలతో నర్సరీల అభివృధ్ధి, రూ.2.61 కోట్లతో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన వాహనాల కోనుగోలు చేశారు. రూ. 78.46 లక్షలతో హరితహారం పనులు, రూ.48.50 లక్షలతో వైకుంఠధామాల అభివృద్ది, రూ.65 లక్షలతో 5 ఓపెన్ జిమ్స్, రూ.1.96 కోట్లతో క్రీడ ప్రాంగణాలు, మంచినీటి పైపులైన్లు, ఇతర పనులు చేపట్టారు. పట్టణంలో 55 వేల మొక్కలను హరితహారంలో నాటేందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం, పారిశుద్ధ్య పనులకు 5 ట్రాక్టర్లను వినియోగిస్తుండగా, 7 స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరణ చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి ఇప్పటి వరకు రూ.11.25 కోట్లు రాగా వివిధ అభివృద్ధ్ది పనులు చేపట్టారు. మిషన్ భగీరథ ద్వారా రూ.59 కోట్లతో మంచినీటి సరఫరా మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రూ.3 కోట్ల జనరల్ ఫండ్తో పనులు సాగుతున్నాయి. ఇప్పటికి పట్టణంలో 90 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్డు వేశారు. రూ.2 కోట్లతో మాడల్ చెరువును ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతున్నారు. పట్టణంలో 5 ప్రాంతాల్లో మాడ్రన్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు.
చొప్పదండి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కింద ఇప్పటి వరకు రూ. 2.48 కోట్లు విడుదలయ్యాయి. వీటిల్లో రూ.38 లక్షలతో పారిశుద్ధ్య పనులకు సంబంధించి రెండు ట్రాక్టర్లు, 2 స్వచ్చ ఆటోలు, బ్లెడ్ ట్రాక్టర్ కోనుగోలు, రూ.10 లక్షలతో డంపింగ్ యార్డులో డీఆర్సీసీ కేంద్రం, రూ. 60 లక్షలతో వైకుంఠదామం నిర్మాణం, రూ. కోటితో శంభునిగుడి దారిలో వైకుంఠధామాన్ని అభివృద్ది చేశారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.66 లక్షలు రాగా పనులు సాగుతున్నాయి. మిషన్ భగీరథ కింద రూ. 2 కోట్లతో 1500 నూతనంగా నల్లా కనెక్షన్లు అందించారు. టీయుఎఫ్ఐడీసీ ద్వారా రూ.38 కోట్లు రాగా వీటితో సెంట్రల్ లైటింగ్, వెదురుగట్ట రోడ్డులో బీటీ రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. రూ. 2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. పట్టణంలో 55 వేల మొక్కలు హరితహారం కింద నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టణంలో రెండు స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు. రూ.15 లక్షల వ్యయంతో రెండు ఓపెన్ జిమ్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా రూ.2 కోట్ల జనరల్ ఫండ్ ద్వారా వివిధ పనులు సాగిస్తున్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.11 కోట్లు రాగా వివిధ అభివృద్ది పనులు చేపట్టారు. హరితహారం, నర్సరీల అభివృద్ధి, పారిశుధ్య పనులకు సంబంధించి ట్రాక్టర్లు, జేసీబీల కొనుగోలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేశారు. పారిశుద్ధ్య పనులకు 6 ట్రాక్టర్లను వినియోగిస్తుండగా, 9 స్వచ్చ ఆటోల ద్వారా సేకరణ చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి ఇప్పటి వరకు రూ.12.75 కోట్లు రాగా వివిధ అభివృద్ది పనులు చేపట్టారు. మిషన్ భగీరథ ద్వారా రూ.48 కోట్లతో మంచినీటి సరఫరా మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.3.50 కోట్ల జనరల్ ఫండ్తో పనులు సాగుతున్నాయి.
కొత్తపల్లి మున్సిపాలిటీకి 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 60 లక్షలు రాగా పలు పనులు సాగుతున్నాయి. మిషన్ భగీరథ కిందరూ. 70 లక్షలతో మంచినీటి సరఫరా మెరుగుకోసం పనులు సాగిస్తున్నారు. టీయుఎఫ్ఐడీసీ కింద రూ. 2 కోట్లు రాగా సీసీ రోడ్లు పనులు సాగుతున్నాయి. రూ. 78 లక్షలతో సమీకృత మార్కెట్ పనులు సాగుతుండగా, రూ. 15 లక్షలతో 4 టాయిలెట్స్, రూ.2.70 కోట్ల జనరల్ ఫండ్ నిధులతో పనులు సాగుతున్నాయి. పట్టణానికి సంబంధించి పట్టణ ప్రగతి కింద ఇప్పటి వరకు రూ. 1.50 కోట్లు రాగా వీటిల్లో రూ.22 లక్షలతో రెండు ట్రాక్టర్లు, ఒక స్వచ్చ ఆటో, వాటర్ ట్యాంకర్ను కోనుగోలు చేసి వినియోగిస్తున్నారు. రూ. 10 లక్షలతో డంపింగ్యార్డులో డీఆర్సీసీ కేంద్రం ఏర్పాటు చేశారు. రూ. 25 లక్షలతో రెండు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేశౠరు. రూ.15 లక్షలతో 4 నర్సరీలు, బృహాత్ పట్టణ ప్రకృతివనం ఏర్పాటు చేశారు.
బల్దియా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఓపెన్ జిమ్లో 10 రకాల వస్తువులు ఉన్నాయి. వీటితో శారీరకంగా మంచి ఎక్సర్సైజు అవుతుంది. ఉదయం పూట ఇక్కడ రద్దీ ఎక్కువగానే ఉంది. అన్ని వయస్సుల వారు వినియోగించే విధంగా ఉండడంతో అందరూ వీటిపై కసరత్తు చేస్తున్నారు. ఇది ఎంతో మంచి నిర్ణయం.
– ఇంద్రసేనారెడ్డి, రాంచంద్రపూర్కాలనీ
నగరంలో బల్దియా ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కింద వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేయడంతో నిత్యం వాకింగ్ చేయడానికి అనుకూలంగా మారాయి. వాకింగ్ తర్వాత ఎక్సర్సైజు చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ ఎంతో బాగున్నాయి. వీటిలో ఏర్పాటు చేసిన సామగ్రి అన్ని తీరుల్లో కసరత్తు చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. వృద్ధులు కూడా ఓపెన్ జిమ్లో ఎక్సర్సైజు చేసే విధంగా ఉన్నాయి. పట్టణ ప్రగతి ద్వారా నిధులు మంజూరు చేస్తూ పట్టణాలు, నగరాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
– మహేందర్రెడ్డి, వాకర్