కార్పొరేషన్, జనవరి 28: కరీంనగర్ బల్దియా పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సోమవారంతో నాలుగేళ్లు పూర్తవుతున్నది. పాలకవర్గం నాలుగేళ్లలో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. స్మార్ట్సిటీ, సీఎం అస్యూరెన్స్, పట్టణ ప్రగతి, ఆర్థిక సంఘం నిధులతో అన్ని డివిజన్లలో అభివృద్ధి పనుల జోరుగా సాగాయి.
ముఖ్యంగా మూడేళ్లుగా నగరంలో రోజూ మంచినీటి సరఫరాను విజయవంతంగా చేపడుతున్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. వీటితో పాటు నగరంలోని ప్రధాన చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దారు. మార్కెట్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి పనులు చేపట్టి ఆయా డివిజన్లలో ప్రజల సమస్యలను పరిష్కరించారు. ముఖ్యంగా హౌసింగ్బోర్డు కాలనీని మోడ్రన్ కాలనీగా తీర్చిదిద్దారు. అతి త్వరలోనే ఈ కాలనీలో 24 గంటల మంచినీటి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్ బల్దియా సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు మేయ
ర్ యాదగిరి సునీల్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. 22 ఎజెండా అంశాలతో కూడిన కాపీలను ఇప్పటికే పాలకవర్గ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు ప్రజా సమస్యలను లెవనెత్తే అవకాశం ఉంది.
ఈ నాలుగేళ్ల పాలనలో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేశాం. ఈ ప్రభుత్వం కూడా శివారు డివిజన్లలో మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతున్నాం. వచ్చే ఏడాదిలో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– సునీల్రావు, మేయర్