Sircilla | కార్మిక క్షేత్రంలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తున్న సెస్, స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ కృషితో సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో కలుగుతున్న అంతరాయానికి బ్రేక్ వేసేందుకు సిద్ధమైంది. ఈదురుగాలులకు స్తంభాలు నేలకూలడం, తీగలు తెగిపడుతుండడంతో వీటన్నింటి పరిష్కారానికి పైలెట్ ప్రాజెక్టుగా భూగర్భ విద్యుత్ లైన్ వేయాలని నిర్ణయించింది. సిరిసిల్లలో కొత్తగా నిర్మించనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీతోపాటే పవర్ కేబుల్ వేయనుండగా, ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన యంత్రాంగం, డీపీఆర్ తయారీలో తలమునకలైంది.
రాజన్న సిరిసిల్ల, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వైపరీత్యాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయానికి చెక్ పెట్టేందుకు సిరిసిల్ల సెస్ సరికొత్త ప్రణాళిక వేసింది. పర్యావరణాన్ని కాపాడే చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లపై పడిపోవడం, ఎండాకాలంలో అకాల వర్షాలు, వానాకాలంలో భారీ వర్షాలతో స్తంభాలు కూలిపోయి కరెంటు సరఫరాకు అంతరాయం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నది. కరెంటు లేక ప్రజలు రాత్రి వేళల్లో అంధకారంలో ఉండే పరిస్థితి నెలకొంటుంది. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి విద్యుత్ వైర్లకు అడ్డు తగులుతూ తరచూ బ్రేక్ డౌన్ అవుతుందన్న కారణంతో సెస్ సిబ్బంది తరచూ కొమ్మలను నరికివేస్తున్నారు. నీడనిచ్చే చెట్లను విద్యుత్ వైర్ల కోసం కొట్టి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పలుసార్లు ప్రకృతి ప్రకోపానికి ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయి సంస్థకు ఆర్థికంగా నష్టం జరగడమే కాకుండా మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదాలు, ఆర్థిక నష్టాలను నివారించేందుకు భూగర్భ విద్యుత్ లైన్ వేయాలని నిర్ణయించింది.
ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం, సంస్థకు జరుగుతున్న నష్టాలను సె స్ చైర్మన్ చిక్కాల రామారావు ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వస్త్ర ప రిశ్రమ, వ్యవసాయ, పరిశ్రమలకు ఇబ్బందులు కలుగడం, చెట్ల నరికివేతతో పర్యావరణం దెబ్బతినడంలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భంలో విద్యుత్ కేబుల్ వేయడమే సమస్యకు పరిష్కారమని, అందుకు నిధులు కేటాయించాలని కోరారు. చిక్కాల వినతికి సానుకూలంగా స్పందించిన అమాత్యుడు సర్వే చేసి అంచనాలు రూపొందించాలని అధికారులను ఇటీవలే ఆదేశించ గా, బల్దియా, సెస్ అధికారులు రంగంలోకి దిగి సర్వే చేశారు. జిల్లా కేంద్రంలో దశలవారీగా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్కు అయ్యే ఖర్చు అంచనాలు రూపొందించే పనిలో ఉన్నారు. తొలి దశ లో కార్గిల్లేక్ నుంచి చంద్రంపేట, అంబేద్కర్ నుంచి మానేరు బ్రిడ్జి దాకా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఈ క్రమంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సిరిసిల్ల మున్సిపాలిటీ అండర్గ్రౌండ్ డ్రౌనేజీని రూ. 225 కోట్లతో నిర్మించాలని గతంలోనే ప్రణాళికలు రూపొందించింది. ప్రతివార్డులో చిన్న చిన్న ము రుగు కాలువలు ఉన్నాయి. వీటన్నింటిని తొలగించి అంతర్గత డ్రైనేజీ నిర్మించేందుకు డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. నిధులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భూగర్భ విద్యుత్ కేబుల్ వేయాలంటూ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ప్రస్తావన ముందు పెట్టడంతో కాస్త ఆలస్యం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ముందు చేపడితే, విద్యుత్ కేబుల్ కోసం మళ్లీ రోడ్లను తవ్వాల్సి వస్తుంది.
దీంతో వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉన్నందున మున్సిపల్ నిర్మించే యూజీడీలోనే విద్యుత్ కేబుల్ వేసేలా ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. అందుకే మున్సిపల్, సెస్ అధికారులు సమన్వయంతో సర్వే చేసి డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. నివేదికలు ప్రభుత్వానికి అందజేసిన తర్వాత మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు. కాగా, సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం పరిధిలో జిల్లాలోని 13 మండలాలున్నాయి. ట్రాన్స్కో నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సెస్ తన వినియోగదారులకు విక్రయిస్తున్నది. ఏడాదికి 926 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న ఈ సంస్థ అన్ని రంగాలకు సరఫరా చేస్తున్నది. అందులో వ్యవసాయ రంగానికి 630, గృహాలకు 158, వా ణిజ్యం 26, పరిశ్రమలు 36, మరమగ్గాలకు 27, వీధి దీపాలు 5, నీటి సరఫరా 12, సాధారణం 2 మిలియన్ యూనిట్లను విక్రయిస్తున్నది.