అన్నదాతను అకాల పీడ వెంటాడుతున్నది. బంగారు పంటలు చేతికొస్తున్న తరుణంలో దుఃఖాన్ని మిగులుస్తున్నది. ఎండకాలం పూట వానకాలన్ని తలపించేలా కొడుతున్న వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ఇప్పటికే పడిన వర్షాలతో పంటలన్నీ దెబ్బతినగా, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా పడి నిండా ముంచింది. కోత దశలో ఉన్న వరి నేలవాలి గింజలన్నీ రాలిపోగా.. కోసిన ధాన్యం కల్లాల్లో తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో ధాన్యం మొలక వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన రైతులు తడిసిన వడ్లను ఆరబోస్తూ.. కుప్పబోస్తూ.. టార్ఫాలిన్లు కప్పుతూ.. మళ్లీ తీస్తూ అక్కడే గడుపుతున్నారు. వరితోపాటు ఇతర పంటలూ దెబ్బతినగా, అకాల వర్షాలు రైతన్నకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా నష్టాన్ని చూపుతున్నాయి.
-కరీంనగర్, మే 1 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ జిల్లాలో ఆదివారం 39.2 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా కరీంనగర్ మండలంలో 86.2 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గోపాల్పూర్లో పది ఎకరాలకుపైగా వాటర్ మిలన్ పంట దెబ్బతిన్నది. చేగుర్తి, దుర్షేడు, చెర్లభూత్కూర్, ఇరుకుల్ల, ముగ్ధుంపూర్, కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలు, గంగాధర మండలంలోని గంగాధర, కొండన్నపల్లి, బూరుగుపల్లి, ర్యాలపల్లి, కురిక్యాల, గట్టుభూత్కూర్, తదితర గ్రామాలు, రామడుగు మండలంలోని పలు గ్రామాలు, చొప్పదండి వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రంతో పాటు గుమ్లాపూర్, భూపాలపట్నం, శంకరపట్నం మండల కేంద్రమైన కేశవపట్నం, తాడికల్, మొలంగూర్, ఆముదాలపల్లి, ధర్మారం, మానకొండూర్ మండలం ఊటూరు, వేగురుపల్లి, రంగపేట, వెల్ది, పచ్చునూర్, హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాలు, సైదాపూర్ మండలంలోని సైదాపూర్, వెన్కేపల్లి, జాగిరిపల్లి, ఘన్పూర్, గొడిశాల, చిగురుమామిడిలోని పలు గ్రామాలు, తిమ్మాపూర్ మండంలోని తిమ్మాపూర్, పోరండ్ల, మన్నెంపల్లి, మల్లాపూర్, పోలంపల్లి, మొగిలిపాలెం, మహాత్మానగర్, రామకృష్ణాకాలనీ, నుస్తులాపూర్, నల్లగొండ, పర్లపల్లి, నేదునూర్, గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, మాదాపూర్, గన్నేరువరం, జంగపల్లి గ్రామాల్లో వరి పైరు నేలవాలి గింజలు రాలడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షాలు రైతన్నను నిండా ముంచుతున్నాయి. ఎండకాలం పూట వానకాలాన్ని తలపించే విధంగా పడుతూ, చేతకొచ్చిన పంటలను దెబ్బతీస్తున్నాయి. గత నెల 24 నుంచి వరుసగా ప్రభావం చూపుతూ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
-కరీంనగర్, మే 1 (నమస్తే తెలంగాణ)
ఒక్కరోజే 7,299 ఎకరాల్లో నష్టం
కరీంనగర్ జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి 7,299 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వ్యవసా య అధికారులు అందించిన ప్రాథమిక సర్వే ప్రకా రం ఈ పంటలన్నీ 33 శాతం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ మేరకు డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం చిగురుమామిడిలో 2,459 మంది రైతుల 2,179 ఎకరాలు, ఇల్లందకుంటలో 132 మంది రైతుల 110 ఎకరాలు, గన్నేరువరం లో 237 మంది రైతులు 480 ఎకరాలు, కరీంనగర్రూరల్లో 878 మంది రైతుల 1,485 ఎకరాలు, శంకరపట్నంలో 816 మంది రైతుల 1,202 ఎకరాలు, కొత్తపల్లిలో 397 మంది రైతుల 1,014 ఎకరాలు, తిమ్మాపూర్లో 789 మంది రైతుల 829 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక సర్వేలో వెల్లడైంది. ఇందులో 12 మంది రైతులకు చెందిన 102 ఎకరాల్లో మామిడి పంట, 5,587 మంది రైతులకు చెందిన 7,197 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది.
ఇప్పటికే అపార నష్టం
జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే అపార నష్టం వాటిల్లింది. మార్చిలో కురిసిన వడగండ్ల కారణంగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన పూర్తి స్థాయి సర్వే వివరాల ప్రకారం 8,116.11 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువగా వరి పంటనే ఉంది. సీఎం కేసీఆర్ మార్చి 23న జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో పంటలు కోల్పోయిన 9,445 మంది రైతులకు రూ. 8.16 కోట్ల నష్ట పరిహారం విడుదల చేశారు. ఇక గత నెల 22న కుసిన వడగండ్లు, ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా 17,197 మంది రైతులకు చెంది 23,709 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గత నెల 24న మరోసారి కురిసిన వర్షం, వడగండ్ల కారణంగా 15,251 మంది రైతులకు చెందిన 19,568 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ మూడు సందర్బాల్లో వరి పంటకే అపార నష్టం కలిగింది. పూర్తి స్థాయి అంచనాకు సర్వే నిర్వహిస్తున్నారు.
వేగవంతమైన కొనుగోళ్లు
తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా మరో పక్క అధికారులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశారు. జిల్లాలో ఆదివారం వరకు 2,025 మంది రైతుల నుంచి 1,41,796 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాది ఏప్రిల్ 30 వరకు కేవలం 1,373 మంది రైతుల నుంచి 84,084 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం తేమ శాతం 17కు చేరిన వెంటనే ప్రతి రైతు ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని, తేమ శాతం చూసుకుని ప్రతి గింజా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లను అధికారులు అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్తోపాటు డీఆర్డీవో ఎల్ శ్రీలతారెడ్డి ఎప్పటికపుడు కేంద్రాలను పరిశీలిస్తున్నారు.