“విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడే దళితుల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ఎంతో ఆలోచన చేసి తెచ్చిన దళితబంధు చాలా బాగున్నది. దళితుల ఆర్థిక, సామాజిక, సాధికారతను ఇది ఎంతో ప్రభావితం చేస్తున్నది. నిన్నటి వరకు కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేసిన ఎంతో మంది యజమానులుగా మారుతున్న తీరు అద్భుతంగా ఉన్నది. నేను ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతున్నా. సీఎం కేసీఆర్ అభినందనీయుడు” అని రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ కితాబిచ్చారు. శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డితో కలిసి హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. లబ్ధిదారులనుంచి వివరాలు తెలుసుకుంటూ వారు పొందుతున్న ఉపాధి, ఆర్థికంగా ఎదుగుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు.
కరీంనగర్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్/ జమ్మికుంట : తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ఎంతో గొప్పదని, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ కితాబిచ్చారు. శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో నేరుగా హుజూరాబాద్ చేరుకున్నారు. మంత్రి, విప్తోపాటు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో కలిసి హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో పర్యటించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, జమ్మికుంటకు వెళ్లారు. అక్కడ కూడా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
రెండు పట్టణాల్లోనూ దళితబంధు కింద ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆర్థికంగా ఎదుగుతున్న తీరును తెలుసుకుని, ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. దళితబంధు లాంటి పథకం దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలైతే దళితులు ఆర్థికంగా ఎప్పుడో బలపడేవారని అభిప్రాయపడ్డా రు. ఇలాంటి పథకం ఒకటి అమలు చేయాలనే ఆలోచన వచ్చినందుకు కేసీఆర్ అభినందనీయుడని కొనియాడారు. కేసీఆర్ దేశానికే దారి చూపి దిక్సూచిగా మారారని అన్నారు. దళితుల ఆర్థిక, సామాజిక, సాధికారతను దళిత బంధు పథకం ఎంతో ప్రభావితం చేస్తుందని చెప్పారు. పేదల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు రూపొందిస్తున్నప్పటికీ కౌంటర్ గ్యారంటీ, మార్టిగేజ్ లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, దళిత బంధు ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని అందించడం గొప్ప విషయమని అన్నారు. గతంలో దళితులు ఏ పథకాలను సాధించ లేక పోయారని, ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద పథకం ద్వారా అన్నీ సాధించుకోగలుగుతున్నారని స్పష్టం చేశారు.
దళిత బంధును అధికారులు క్షేత్ర స్థాయి లో పకడ్బందీగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, ఈ మహోన్నత పథకం దేశ వ్యాప్తంగా అమలు కావల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా దేశంలోని దళితులందరు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించగలుగుతారని చెప్పారు. నిన్నటి వరకు కూలీలుగా, డ్రైవర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు యజమానులుగా మారుతున్న తీరు అద్భుతంగా ఉందన్నారు. ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడే దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని, సామాజికం గా గౌరవం లభిస్తుందని చెప్పారు.
గడిచిన 70 ఏళ్లుగా దళితులకు ఉపాధి అవకాశాలు లేక, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ లేదని, దళిత బంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ దేశానికి ఒక దారిని చూపారని స్పష్టం చేశారు. ఓబీసీలు, ఆర్థికంగా వెనకబడిన ఇతర వర్గాల కోసం కూడా ఇలాంటి పథకాలు తేవాలని తాను సీఎం కేసీఆర్తో చర్చిస్తానని అన్నారు. ఆర్థికంగా వెనబడిన 30 శాతం ప్రజల జీవన ప్రమాణాలు మెరుపర్చాలంటే దళితబంధు వంటి పథకాలు అనేకం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పాడి కౌశ్క్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మున్సిపల్ చైర్ పర్సన్లు గందె రాధిక, తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఆర్డీవో హరిసింగ్, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీడీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సమ్మ య్య తదితరులు ఉన్నారు.
జమ్మికుంటలో దళిత బంధు కింద ఏర్పాటు చేసుకున్న భగవతి లేడీస్ ఎంపోరియం అండ్ బ్యూటీపార్లర్ (సిద్ధంకి సునీత), గాయత్రి మ్యాచింగ్ సెంటర్ (తలగంప వనజ), అను గోల్డెన్ బేకరీ అండ్ స్వీట్ షాప్ (బైరిమల్ల విజయ)లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయాచోట్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ‘గతంలో ఏం పనిచేశారు? దళితబంధుతో జీవితం ఎలా ఉన్నది? నెలకు ఖర్చులన్నీ పోనూ ఎంత సంపాదిస్తున్నారు?’ తదితర విషయాలను అడిగారు. ‘నాకు తల్లిదండ్రులు లేరు. సీఎం కేసీఆరే మాకు దిక్కైండు’ అని భగవతి లేడీస్ ఎంపోరియం నిర్వాహకురాలు సునీత చెప్పింది. ఇప్పుడు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాని తెలిపింది. ‘గతంల కూలీ పనులు చేసుకునే వాళ్లం. దళిత బంధుతో ఫ్యాబ్రిక్ షాపు, ఎంబ్రాయిడరీ ఏర్పాటు చేసుకున్న’ అంటూ గాయత్రి ఫ్యాబ్రిక్స్ ఓనర్ వనజ చెప్పుకొచ్చారు. ‘ఒకప్పుడు బేకరీ షాపులో పనిచేసేవాళ్లం. ఇప్పుడు అదే షాపునకు ఓనర్రైన. పది మందికి పని చూపుతున్న’ అంటూ బేకరీ నిర్వాహకురాలు విజయ తెలిపారు. ఇప్పుడు ఖర్చులన్నీ పోనూ.. నెలకు 20వేల నుంచి 50వేల వరకు సంపాదిస్తున్నామని వారు చెప్పారు. దళిత బంధుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దళిత కుటుంబాలను చూసి ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అబ్బురపడ్డారు. లబ్ధిదారులను అభినందించారు. అను గోల్డెన్ బేకరీలో అంబేద్కర్ చిత్రంతో నిర్వాహకుడు బైరిమల్ల అనిల్ ప్రత్యేకంగా కేక్తో తయారు చేయగా, ప్రకాశ్ కట్ చేసి లబ్ధిదారులకు తినిపించారు.
జమ్మికుంట నుంచి తిరిగి హుజూరాబాద్ చేరుకున్న ప్రకాశ్ యశ్వంత్ వరంగల్ రోడ్డులోని జై కిసాన్ ఫర్టిలైజర్ (నిర్వాహకురాలు మోత్కూరి హరిత), డీసీఎంఎస్ కాంప్లెక్స్లో రెయిన్బో మెడికల్ దుకాణం పరిశీలిం చారు. అనంతరం ఆరుగురు లబ్ధిదారులు కలిసి 60లక్షలతో ఏర్పాటు చేసుకున్న కుశాల్ మాడ్రనైజ్డ్ ఫ్లెక్సీ ప్రింటర్ షాపును ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేశామని లబ్ధిదారుల్లో ఒకరైన రాహుల్ చెప్పడంతో ప్రకాశ్ సంతోషం వ్యక్తం చేశారు. చక్కగా షాపు నడుపుకొని పలువురికి ఆదర్శంగా ఉండాలని కాంక్షించారు. చివరగా మామిండ్లవాడలో దళితబంధు నాన్ఓవెన్ బ్యాగు తయారీ మినీ ఇండస్ట్రీస్ (వేల్పుల శారద)ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయాచోట్ల లబ్ధిదారులతో ప్రకాశ్ యశ్వంత్ మాట్లాడారు. ఒక్కో యూనిట్ ద్వారా నెలకు 20 వేల నుంచి 50 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఏర్పడిందని లబ్ధిదారులు చెప్పారు. గతంలో తాము ఒకరి వద్ద కూలీగానో, జీతంగాళ్లుగానో ఉండే వాళ్లమని, ఇప్పుడు కేసీఆర్ సహకారంతో యజమానులుగా మారామని చెప్పారు. తమ జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని, ఆర్థికంగా బలోపేతం అవుతున్నామని, పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నామని వివరించారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో లబ్ధిదారులను ఆయన, ఆయనను లబ్ధిదారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.