కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధుపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, కలెక్టర్, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ వివాహమైన ప్రతి దళిత కుటుంబం, రేషన్ కార్డు ఉన్న వారందరికీ దళితబంధు పథకం కింద డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. దళితబంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలన్నారు. దళితబంధు పథకం కింద వచ్చే రూ.10 లక్షలతో ప్రతి ఒక్కరూ నాలుగు యూనిట్లు కూడా స్థాపించుకోవచ్చని మంత్రి తెలిపారు. దళితబంధు ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏండ్ల లోపు వయసు ఉన్న దళితులందరికీ దళితబంధు డబ్బులు అందుతాయన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంకా డబ్బులు అందని దళిత కుటుంబాలకు మూడు రోజుల్లోగా వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. ఖాతాల్లో జమ అయిన డబ్బులను ప్రభుత్వం వెనక్కు తీసుకోదని, ఆ డబ్బులతో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవాలన్నారు. యూనిట్లు స్థాపించుకునేంత వరకు ఖాతాలో నిల్వ ఉండే డబ్బులకు బ్యాంకులు వడ్డీ కూడా ఇస్తాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని బ్యాంకుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి దళితబంధు పథకం డబ్బుల గురించి అడిగే లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, డబ్బులు అకౌంట్లలో జమ అయిన లబ్ధిదారులకు రెండు రోజుల్లోగా మెసేజ్లు పంపాలని బ్యాంకర్లను ఆదేశించారు.
హుజూరాబాద్లోని ఏడు మండలాల్లో మంగళవారం పర్యటించి దళితబంధు రాని వారి వివరాలు సేకరించి డబ్బులు జమ చేయడంతో పాటు, క్రాస్ చెక్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రేషన్ కార్డు లేని వారి నుంచి ఆధార్ నెంబర్ తీసుకొని, ఈ నెంబర్తో రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉందో తనిఖీ చేసి, వారికి దళితబంధు పథకం రాష్ట్రమంతటా అమలవుతుందని వివరించాలని అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల లబ్ధిదారులతో విడుతల వారీగా గురువారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించాలని, అందులో తనతో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, క్లస్టర్ అధికారులు పాల్గొంటామని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో కలిసి హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండలాల క్లస్టర్ అధికారుల నుంచి దళితబంధు పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు అకౌంట్లలో మూడు రోజుల్లోగా డబ్బులు జమ చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రులు చేసిన సూచనలు అధికారులకు వివరించారు.
అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 21న నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అధికారులతో దళితబంధు రాని వారి వివరాలు సేకరించి, అర్హులైన వారికి వెంటనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. డబ్బులు జమ అయిన వారి సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం పంపిస్తామన్నారు. ఈ నెల 23 న టెలీకాన్ఫరెన్సు నిర్వహించి లబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సందేహాలు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. డైయిరీ యూనిట్లు స్థాపించుకునే వారికి శిక్షణ ఇప్పిస్తామని మంత్రులకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంకా ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, సుదర్శన్రెడ్డి, నన్నపనేని నరేందర్, జెడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ హన్మంత్, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, హన్మకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ ప్రియాంక, హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్రెడ్డి, నగర మేయర్ వై సునీల్ రావు, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.