‘దళితులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు తెచ్చిందే దళితబంధు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకం బృహత్తరమైంది. సమాజంలో సమానత్వాన్ని పెంచింది. భవిష్యత్ తరాలకు వెలుగులు చూపుతున్నది. అంబేద్కర్ కన్న కలలు సాకారం చేసే దిశగా సీఎం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పథకం అమలు చేయడమే కాదు, రాజధానిలో అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు’ అని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధుతో పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారికి బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం నిర్వహించగా, మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హుజూరాబాద్లో పథకం విజయవంతమైందని, నిన్నటి దాకా కూలీలుగా ఉన్న వారు నేడు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం అధికారుల చిత్తశుద్ధితోనే సాధ్యమైందని ప్రశంసించారు.
కలెక్టరేట్, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని దళితులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు సమాజంలో సమానత్వాన్ని పెంచిందని, భవిష్యత్ తరాల్లోనూ వెలుగులు నింపుతుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందిన అనేక మంది ఏర్పాటు చేసుకున్న స్వయం ఉపాధి పథకాలు, పరిశ్రమల ద్వారా యజమానులుగా మారి ఆర్థిక రాబడి పొందుతున్నారని స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కింద ఏర్పాటు చేసుకున్న పలు యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న దళిత పారిశ్రామికవేత్తలను బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వమే దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచన చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల జీవితాలను అభివృద్ధి పరుస్తామనే మాటలు మాత్రమే వినపడేవని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేతల్లో చేసి చూపారని ప్రశంసించారు. దళితులు నాడు అప్పు కోసం వెళితే తనాఖా పెట్టేందుకు చర, స్థిరాస్థులు లేక అప్పు పుట్టక ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు గుర్తు చేశారు. నేడు అంబేద్కర్ కన్న కలలు సాకారం చేసే దిశగా సీఎం కృషి చేస్తున్నాడని కొనియాడారు. దళితులు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేలా ప్రణాళికలు రూపొందించడమే కాకుడా దళితబంధును అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంతి పథకం దేశంలోని మరే రాష్ట్రంలో లేదని, కేవలం తెలంగాణలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా అమలు చేస్తున్న పథకం లబ్ధిదారుల నిబద్ధత, అధికారుల కృషితో విజయవంతంగా కొనసాగుతున్నదని వివరించారు. లబ్ధిదారుల్లో అధికంగా కూలీలు, గుమస్తాలు ఉండేవారని, కానీ నేడు వారంతా యజమానులుగా ఎదిగారంటే అందుకు ప్రభుత్వ కృషి ఎంతో ఉందన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో పథకం పరిపూర్ణమైందని, వందశాతం లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి దళితుడు అర్హుడేనని, కార్డు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని, అందులో భాగంగానే దళితబంధును అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల మెప్పు పొందిన అంబేద్కర్ అతి పెద్ద విగ్రహాన్ని రాజధాని నడి బొడ్డున ఏర్పాటు చేసి, ఆయన జన్మదినమైన ఈ నెల 14న ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర రాష్ర్టాలు ఈర్శ్య పడేలా, తెలంగాణ ప్రజలు గర్వ పడేలా 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ విగ్రహం పాలకుల బాధ్యతను గుర్తు చేస్తున్నదన్నారు. దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినట్లు వివరించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే వాహనాలతో పాటు వ్యక్తిగతంగా కూడా తాను మరిన్ని వాహనాలు సమకూర్చనున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు హుజురాబాద్ సెగ్మెంట్లో దళితబంధు పథకం విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ను అభినందించారు. అనంతరం దళితబంధు ఉత్తమ పారిశ్రామికవేత్తలను మంత్రి ఘనంగా సన్మానించారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీఆర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, శిక్షణ కలెక్టర్ లెనిన్ టోప్పో, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
సమాజంలో అంటరానివారుగా గుర్తించబడ్డ దళితులను ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు మా కుటుంబాన్ని గుమస్తా స్థాయి నుంచి యజమానులుగా మార్చింది. నా పెండ్లికి ముందు నుంచి నా భర్త ఫర్టిలైజర్ షాపులో గుమస్తాగానే పని చేసేవాడు. వచ్చే రూ.10వేల జీతం కుటుంబ ఖర్చులకు సరిపోని పరిస్థితి. ఉన్న స్థితిలోనే సర్దుకుపోతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మాకు దళితబంధు ఆశాకిరణమైంది. దరఖాస్తు చేసుకున్న వెంటనే నా బ్యాంకు ఖాతాలో రూ.పది లక్షలు జమయ్యాయి. ఆ మొత్తంతో నా భర్తకు అనుభవం ఉన్న ఫర్టిలైజర్ షాపునే మేం ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం నెలకు రూ.50వేల దాకా ఆదాయం వస్తోంది. మాతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాం. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతోంది. ఇదే స్ఫూర్తి దేశవ్యాప్తంగా కొనసాగిస్తే, మాలాంటి అట్టడుగు వర్గాల నుంచి వస్తున్న దళితులంతా త్వరలోనే అభివృద్ధి చెంది, బాబాసాహెబ్ ఆశయాలు నెరవేర్చుతాం. ఇది జరగాలంటే దేశవ్యాప్తంగా కేసీఆర్ పాలన రావాలి.
– మోత్కూరి హారిక, ఫర్టిలైజర్ నిర్వాహకురాలు, హుజూరాబాద్
నాభర్త చేసే పనికి నన్ను ఓనర్ను చేసిన సీఎం కేసీఆర్ సార్ మా కుటుంబానికి దేవుడు. అప్పులతో బాధపడుతున్న మా కుటుంబానికి దళితబంధు పథకం ఇచ్చి ఆదుకున్నాడు. వరికోత మిషన్పై నాభర్త పనిచేసేటోడు. కోతలు ఉన్నపుడు మాత్రమే ఆయనకు పనిదొరికేది. మిగతా టైంలో కూలీ పనులకు వెళ్లేవాళ్లం. కుటుంబ పోషణ కూడా కష్టసాధ్యంగా ఉండేది. దళితబంధులో నన్ను లబ్ధిదారురాలుగా ఎంపిక చేసి, ఇచ్చిన రూ.పది లక్షలతో వరికోత మిషన్ కొనుక్కున్నం. ఏడాదిలో నాలుగు నెలలపాటు పని దొరుకుతంది. మిగతా సమయంలో ట్రాక్టర్ ద్వారా నాభర్త ఇతర పనులు చేస్తున్నాడు. ఖర్చులు పోను నెలకు రూ.15వేల దాకా ఆదాయం వస్తోంది. ఇప్పుడు మాకు ఏ బాధా లేదు. పిల్లలను బాగా చదివిస్తున్నా.
– రాం స్వర్ణలత, వరికోత యంత్రం యజమానురాలు, పాతర్లపల్లి, ఇల్లందకుంట
వ్యవసాయ కూలీగా పనిచేసే నేను ఇతరులకు కూలీ పని కల్పించే స్థాయికి ఎదిగానంటే అది సీఎం కేసీఆర్ చలవే. నేను కూలీకి పోతే రోజుకు రూ.250 నుంచి రూ.300 వచ్చేటియి. ఓ రోజు పని ఉంటే మరో రోజు ఉండేది కాదు. ఎవరు పనికి పిలుస్తారా..? అని ఎదురుచూసేది. కానీ దళితబంధు నా జీవితంలో వెలుగులు నింపింది. సర్కారు ఇచ్చిన రూ.10లక్షలతో హుజురాబాద్లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ పెట్టుకున్న. మొన్నటిదాకా కూలీ పనిచేసే నేను ఇప్పుడు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నా. స్థానికంగా, చుట్టుపక్కల గ్రామాల్లో గ్లాసులు, ప్లేట్లు విక్రయిస్తున్నా. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20వేల దాకా మిగులుతున్నాయి.
– కనుకుంట్ల కళ, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్, హుజూరాబాద్
దళితబంధుతో దళితుల జీవితాల్లో మార్పు వచ్చింది. ఒక్కసారిగా ఉన్నత వర్గాలతో పోటీపడుతున్నాయి. ఇప్పటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 యూనిట్లు సెగ్మెంట్లో గ్రౌండింగ్ అయ్యాయి. కొత్తగా మరో 1,700 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వీటిని కూడా పరిశీలించి గ్రౌండింగ్ చేయాలి. దళారులు, మధ్యవర్తులను నమ్మకుండా దళితులు నేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి పథకం వర్తింపజేయాలి.
– ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి
నేను దుకాణాల్లో గుమస్తాగా పనిచేసేవాన్ని. జీతం చాలా తక్కువ. కుటుంబాన్ని నెట్టుకురావడమే కష్టంగా ఉండేది. కానీ సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు నా జీవితాన్నే మార్చివేసింది. దుకాణానికే ఓనర్ను చేసింది. పథకం కింద నాకు వచ్చిన రూ.10లక్షలతో జమ్మికుంటలో ఎలక్ట్రికల్ షాపు ప్రారంభించిన. నాకున్న పాత పరిచయాలతో దుకాణం మంచిగా నడుస్తోంది. రోజుకు రూ.10వేల దాకా వ్యాపారం చేస్తున్నా. గుమాస్తా చేసినపుడు నెలకు రూ.9వేలు వచ్చేది. సొంత దుకాణంతో అన్ని ఖర్చులు పోను నెలకు రూ.15వేలకు పైగానే సంపాదిస్తున్నా.
– కట్టెకోల కుమార్, ఎలక్ట్రికిల్ షాపు, జమ్మికుంట.
ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులతో సతమతమవుతున్న నా కుటుంబానికి దళితబంధు వెన్నుదన్నుగా నిలిచింది. భర్త చేసే చిరుద్యోగంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. పీజీ పూర్తి చేసిన నేను కూలీ పనులు చేయలేక, ఉపాధి దొరక్క దిక్కుతోచని స్థితిలో ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నా. వెంటనే లబ్ధిదారురాలుగా నన్ను గుర్తించి, రూ.10లక్షలు మంజూరు చేశారు. ఆ మొత్తంతో నా భర్తకు అనుభవమున్న వివిధ వాహనాలకు అవసరమైన బ్యాటరీల దుకాణం పెట్టుకున్నాం. భార్యా, భర్తలం ఇద్దరం షాపులో ఉంటూ విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అన్ని ఖర్చులు పోను ప్రస్తుతం నెలకు రూ.25వేలకు పైగానే సంపాదిస్తున్నాం. ఇది మాకు సీఎం కేసీఆర్ పెట్టిన భిక్ష. ఆయన మదిలో నుంచి వచ్చిన ఈ పథకం ద్వారా దళితులు ఇపుడిపుడే ఆర్థికంగా ఎదుగుతున్నరు. రుణాలు, సబ్సిడీలంటూ మభ్యపెట్టడం కాకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేసి, ఇష్టమైన యూనిట్ ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులకు మా కృతజ్ఞతలు.
– ఆరెల్లి ప్రవ, జమ్మికుంట, బ్యాటరీ షాపు నిర్వాహకురాలు
ఏడాది క్రితం వరకు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ టీచర్గా పనిచేశా. నెలకు రూ.6 వేల జీతం. దాంతో నేను, నా కుటుంబం బతకడం చాలా కష్టమయ్యేది. ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతో దళితబంధు పథకంలో నన్ను లబ్ధిదారుడి గుర్తించి, రూ.పదిలక్షలు ఇచ్చారు. జమ్మికుంటలో సూపర్మార్కెట్ ఏర్పాటు చేసుకున్నా. అధికారుల చొరవతో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ, నెలకు రూ.50 వేల దాకా సంపాదిస్తున్నా. వచ్చిన ఆదాయంతో నేను, నా కుటుంబం ఏ బాధాలేకుండా బతుకుతున్నాం. దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి కనబరుస్తూ, సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మా దళితజాతి రుణపడి ఉంటుంది. దళితబంధు దళిత జాతి అభివృద్ధికి తొలిమెట్టుగా నేను భావిస్తున్నా.
– మారుముళ్ల తిరుపతి, జమ్మికుంట, సూపర్మార్కెట్ నిర్వాహకుడు
మాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. నా భర్త బిల్డింగ్ సెంట్రింగ్ పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యంతోనే నేను, నాభర్త కూలీ చేసే చోటనే యజమానులమైనం. దళితబంధు ద్వారా వచ్చిన డబ్బులతో సెంట్రింగ్ సామగ్రి అద్దెకు ఇచ్చే దుకాణం పెట్టుకున్నం. నా భర్త భవన నిర్మాణ ప్రాంతాల నుంచి కిరాయిలు తెస్తుంటే, నేను షాపు మెయింటెన్ చేస్తున్నా. మేము కూలీకి వెళ్తే రోజుకు రూ.500 నుంచి రూ.600 మాత్రమే వచ్చేది. ఇపుడు నెలకు రూ.25వేల దాకా వస్తున్నాయి. దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ పథకంతో మాలాంటి కూలీ చేసుకునే వారి గుండెల్లో సీఎం కేసీఆర్ గుడి కట్టుకున్నాడు.
– జీడి కావ్య, సెంట్రింగ్ షాపు నిర్వాహకురాలు
దుకాణాల్లో గుమస్తాలుగా, పరిశ్రమల్లో కూలీలుగా పనిచేసేందుకు మాత్రమే అర్హులమైన మాలాంటి నిరుపేద దళితులం, కుటీర పరిశ్రమలు స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతామని కలలో కూడా అనుకోలే. బ్యూటీపార్లర్లో నెలవారీ వేతనంపై పనిచేస్తున్న నేను దళితబంధులో దరఖాస్తు చేసుకోవడమే తరువాయి, అధికారులు లబ్ధిదారురాలుగా ఎంపిక చేసి, రూ. పదిలక్షలు నాఖాతాలో జమచేశారు. వెంటనే నాకు అనుభవం ఉన్న బ్యూటీషియన్ వృత్తినే ఉపాధిగా ఎంచుకున్నా. సొంతూరులోనే బ్యూటీ పార్లర్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నా. నెలకు రూ.20వేలకు పైగా ఆదాయం వస్తోంది. సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే మా జీవితాలు నిలబడ్డాయి. ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ఇంటిలోనే ఉంటూ, ప్రతి రోజు డబ్బులు సంపాదించే మార్గం చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం.
– ఆరెల్లి సంధ్య, బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు,
రాచపల్లి, ఇల్లందకుంట మండలం