గతేడాది మాదిరిగానే సాగునీరందుతుందని ఆశించిన ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడుపల్లి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. సాగునీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ఎక్కడికక్కడ పొలాలు నెర్రెలు బారి, పొట్ట దశలో చేతికి రాకుండా పోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాడు కేసీఆర్ పాలనలో ఏ రందీ లేకుండా పంటలు సాగు చేసుకున్నామని, ఈ సారి అంతా మునుగుడే అయితదని వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని, నీళ్లివ్వాలని అడిగితే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా అయితే తమ సమస్యను ఎవరికీ చెప్పుకునేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరందించాలని, పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.
వెల్గటూర్, మార్చి 8 : గతేడాది మాదిరిగానే ఈ యాసంగిలో కూడా ఏ రందీ లేకుండా సాగు చేసుకోవచ్చని అన్నదాతలు భావించారు. ఎస్సారెస్పీ లేదా పంప్హౌస్ ద్వారా నీళ్లు వస్తాయన్న గంపెడాశతో దాదాపు 820 మంది రైతులు ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాల పరిధిలో 1800 ఎకరాల్లో వరి వేశారు. మెజార్టీ రైతులు ఎస్సారెస్పీ కాలువ (డీ83 ఉపకాలువ 11ఎల్)తోపాటు బావులపై ఆధారపడి సాగు చేశారు. అయితే మొదట్లో తెగుళ్లు రావడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు తంటాలు పడ్డారు. అప్పుడు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, మందులు పిచికారీ చేశారు. తీరా ఇప్పుడు పంటలు పొట్ట దశకు చేరుకున్న సమయంలో సాగునీరు అందకపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కాలువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఆగమవుతున్నారు.
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు యాసంగికి వారబంధీ ద్వారా సాగునీరు ఇచ్చేవారు. ఒక వేళ కాలువ ద్వారా నీళ్లివ్వని పరిస్థితుల్లో మారేడుపల్లి పక్కనే ఉన్న వేంనూర్ పంప్హౌస్ నుంచి నంది రిజర్వాయర్కు నీటిని తరలించే పైప్లైన్కు ఉన్న వాల్వ్ను ఓపెన్ చేసి ఎస్సారెస్పీ 11ఎల్ కాలువలోకి వదిలేవారు. ఇలా నీరు సరఫరా చేసి పంటలు ఎండకుండా కాపాడారు.
కానీ, ప్రస్తుతం ఎక్కడి నుంచి కూడా నీళ్లచ్చే పరిస్థితి లేదు. గతంలో యాసంగికి వారబంధీ ద్వారా ఈ పంటలకు నీరిచ్చినా.. ఈ సారి ఈ రెండు గ్రామాలకు రావడం లేదు. ఎస్సారెస్పీ ద్వారా చొప్పదండి రేవెళ్లి వద్ద ఓసీ పాయింట్ నుంచి డీ83 కెనాల్కు 1800 క్యూసెక్కులు రావాల్సి ఉన్నా.. 1100 క్యూసెక్కులకు మించి ఇవ్వడం లేదు. దీంతో నీటిని డిస్ట్రిబూటర్లకు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతుండగా, చివరి ఆయకట్టులో పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే దాదాపు 100 మంది రైతులకు చెందిన 300 ఎకరాలు పొట్టదశలో ఎండిపోయాయి. పొలాలు బీటలు వారుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ వచ్చే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చేస్తున్నారు.
ఎండపల్లి మండలంలో సాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశ్యంతో నాడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ చూపారు. నంది రిజర్వాయర్ నుంచి రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ను తవ్వి, ఖిలావనపర్తి దగ్గర ఎస్సారెస్పీ 11ఎల్కు కలుపాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు సహకారంతో 8.55 కోట్లు నిధులు మంజూరు చేయించారు. కానీ, ఎన్నికలు రావడంతో ఆ పనులు జరగలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో కాలువ నిర్మాణం జరుగుతుందా..? లేదా..? అన్న అనుమానం రైతుల్లో నెలకొన్నది.
గతంలో కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి ఏడాది పొడువునా గోదావరినదిలో నీళ్లు నిల్వ చేసిన్రు. అప్పుడు భూగర్భ జలాలు పైకొచ్చినయి. తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండె. ఇప్పుడు గోదావరి నీళ్లు లేవు. భూగర్భజలాలు కూడా అడుగంటుతున్నయి. నీళ్లు లేక పంట పొలాలు ఎండుతున్నయి. కనీసం పశువులు తాగడానికి కూడా నీళ్లు కరువైనయి. పశువులకైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
– కొమ్ము సంజీవ్, రైతు (మారేడుపల్లి
నాకున్న ఎకురం ఉన్నది. గతేడాది మాదిరిగా నీరందుతుందని ఆశపడి ఎకరాకు రూ.12 వేలు చెల్లించి మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్న. మొత్తం మూడున్నర ఎకురాల్లో పొలం వేసిన. ఇప్పుడు నీళ్లందక పొలాలు ఎండుతున్నయి. మా పక్కనే వేంనూర్ పంపౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నది. కానీ, మాకు సాగునీరు అందుత లేదు. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవాలి. మాకు శాశ్వత పరిష్కారం చూపాలి. నీళ్లు రాకపోతే పంటలు పోతయి. పెట్టుబడులు ఎళ్లక మేం అప్పులపాలైతం.
– బైరం మధు, కౌలు రైతు (ముంజంపల్లి)