సూర్యాపేట, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీం నత్త సిగ్గు పడే రీతిన కొనసాగుతోంది. తొలి విడతలో జిల్లాకు 14 వేల ఇండ్లుకుగాను ఇప్పటి వరకు 16.27 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం రూ.700 కోట్లు వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.167 కోట్లు మాత్రమే విడుదలయ్యాయంటే ఏ రీతిన నిర్మాణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2025 జనవరి 26న ప్రారంభించిన ఈ స్కీం ఏడాదిన్నర గడిచినా పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో అంతంత మాత్రంగా కూడా పూర్తి చేయకపోగా ఇతర గ్రామాల పరిస్థితి అతీగతి లేకపోవడం గమనార్హం. తొలి విడతకే ఇంతటి నిర్లక్ష్యం అలుముకుంటే ప్రభుత్వం ఇటీవల రెండో విడత నియోజకవర్గానికి రెండువేల చొప్పున ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించడంపై పేద, మధ్య తరగతి వర్గాలు ఇక వీరు ఇచ్చినట్లేనని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మాది ఇందిరమ్మ రాజ్యం.. పేదలకు సుపరిపాలన అందించే ప్రజాపాలన తమది అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని విషయాల్లో అన్ని వర్గాలను మోసం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అన్నింటా విఫలమవుతూ.. ఇచ్చిన హామీల్లో ఐదుశాతం కూడా పూర్తి చేయకుండా.. స్వర్గీయ ఇందిరాగాంధీ పేరుతో ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు నిర్మించి ఇస్తామన్న హామీని అవినీతిమయంగా మార్చారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అర్హులైన పేదలకు పార్టీలకతీతంగా కేటాయించాల్సిన ఇండ్లను అనర్హులకు ఇచ్చారని అనేకసార్లు నిరసనలు వ్యక్తమైన విషయం విదితమే. ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్న వారంతా అధికార పార్టీకి చెందిన వారే కాగా సొంత పార్టీతో పాటు తమ బంధువులనే ఎంపిక చేస్తున్నారని, అడిగినంత డబ్బులు ఇచ్చిన వారికే ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇండ్లు నిర్మాణం చేసుకుంటే రూ.5 లక్షలు ప్రకటించింది. నిర్మాణం పూర్తి చేసిన తరువాత నాలుగు నుంచి ఐదు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించి 18 నెలలు గడిచినా 16.27 శాతమే పూర్తి చేశారు.
జిల్లాలో నిధుల లేమితో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నత్త నడకన కొనసాగుతున్నాయి. తొలి విడతలో 14 వేల ఇండ్లు మంజూరు చేశారు. ఒక్కో ఇల్లుకు రూ.5 లక్షల చొప్పున రూ.700 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏమైందో ఏమోగానీ జిల్లాలో కేవలం 7,928 ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. వీటిలో 6,085 ఇండ్లు గ్రౌండింగ్ కాగా 1,843 ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. గ్రౌండింగ్ అయిన వాటిని పరిశీలిస్తే 555 ఇండ్లు బేస్మెట్ లెవల్లో ఉండగా 329 ఇండ్లు గోడల నిర్మాణం పూర్తయింది. 2,603 ఇండ్లకు ఆర్సీ పూర్తి చేశారు. నిర్మాణం ప్రారంభమైన 18 నెలల్లో కేవలం 2,278 ఇండ్లు పూర్తయి 16.27 శాతంగా నమోదైంది. తొలి విడతదే ఇలా ఉంటే ఇక రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. రెండో విడత నియోజకవర్గానికి రెండు వేల చొప్పున ఇండ్లు ఇస్తామని చెబుతుండటం.. అవీ మంజూరుకే పరిమితం తప్ప గ్రౌండింగ్ చేసి డబ్బులు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.