ఈ సృష్టి ఎంత అద్భుతమైనదో, దాని తెర వెనుక నడిచే కాలపు నాటకం అంతకంటే విచిత్రమైనది. మనిషి తన మేధస్సుతో ఆకాశాన్నీ, అంతరిక్షాన్నీ శాసించేస్తున్నానని భుజాలు ఎగిరేస్తున్నాడు. నేనే సర్వస్వం అనుకుంటూ దర్పంతో విర్రవీగుతున్నాడు. కానీ, ఆ సర్వశక్తిమంతుడైన సృష్టికర్త ఒక చిన్న చదరంగపు కాయను కదిలిస్తే చాలు… ఈ అహంకారపు సామ్రాజ్యాలు క్షణాల మీద ఇసుక కోటల్లా కూలిపోతాయి.
విపత్తులు – దైవిక హెచ్చరికలు
నిజానికి, ప్రకృతి విపత్తులు అంటే కేవలం భూమి కదలడమో, నదులు పొంగిపొర్లడమో కాదు. అవి దైవిక శక్తి ముందు మానవుని అస్తిత్వపు అసమర్థతను ఎత్తిచూపే నిదర్శనాలు! పవిత్ర ఖురాన్ ఈ సత్యాన్ని ఎంత చక్కగా గుర్తుచేస్తుందంటే:‘మనుషుల చేతులు సంపాదించుకున్న కర్మల కారణంగానే భూమిపై, సముద్రంలో కల్లోలం చెలరేగింది. వారు తమ (చెడు) కర్మల నుంచి వెనక్కి మళ్లే నిమిత్తం అల్లాహ్ వారికి తమ కర్మల ఫలితాలను కొద్దిగా రుచి చూపిస్తాడు’ (ఖురాన్ 30:41) అని హెచ్చరించింది.సమాజంలో పాపాలు హద్దులు మీరినప్పుడు, ధర్మం మరుగున పడి అన్యాయం తాండవిస్తున్నప్పుడు, ఆ దేవుడు మనుషులను మేల్కొల్పడానికి ఇలాంటి విపత్తులనే పెద్ద చౌకీదారులుగా పంపుతాడు. ఇవి కేవలం శిక్షలు మాత్రమే కావు; దారి తప్పిన మనిషిని మళ్లీ సన్మార్గంలో నడిపించడానికి వచ్చే గట్టి హెచ్చరికలు.
మహా వినాశనం..
ఈ చిన్న చిన్న విపత్తులు రాబోయే ప్రళయ కాలానికి సూచికలు. మహా వినాశనం వేళ భూమి తన కడుపులో దాచుకున్న నిధులను, భారాన్ని ఒక్కసారిగా కక్కివేసే భీకర భూకంపాలు వస్తాయి. ఈ సంఘటనను ఖురాన్ స్పష్టంగా తెలియజేసింది. ‘భూమి తన అత్యంత భీకరమైన ప్రకంపనలతో కంపించినప్పుడు, భూమి తనలో దాచుకున్న బరువులన్నిటినీ బయటికి కక్కివేసినప్పుడు, మనుషుడు ‘దీనికి ఏమైంది?’ అని విస్మయానికి గురైనప్పుడు…’ (ఖురాన్ 99:1-3) అంతా వినాశనమే! మానవుడి పాపాలు శ్రుతి మించినప్పుడు నేల కుంగిపోవడం, ఆకాశం నుంచి ఆపదలు ముంచెత్తడం జరుగుతుంది. ఆపై ఏర్పడే అశాంతి, జరిగే మహా విలయం ఈ భూగోళాన్ని అతలాకుతలం చేస్తాయి. మొత్తంగా చూస్తే… ఈ ప్రపంచం శాశ్వతం కాదనీ, ఇదొక తాత్విక ప్రయాణమనీ, మనిషి తన గర్వాన్ని విడనాడి నీతిగా, నిజాయితీగా, తోటివారికి సాయపడుతూ బతకాలనీ ఈ విపత్తులన్నీ మూగ భాషలో మనకు మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూనే ఉన్నాయి. ఈ సృష్టికి ఒక అంతం ఉందన్న సత్యాన్ని గ్రహించి, ఆ దేవుని మార్గంలో నడవడమే మానవ జన్మకు సార్థకత!
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076