రంగారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు గ్రామాల రైతులకు బుల్లెట్ ట్రైన్ టెన్షన్ వెంటాడుతున్నది. ఈ ట్రైన్ ప్రాజెక్టు ప్రభావంతో ఎవరి భూములు పోతాయోనన్న ఆందోళనతో పలు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అంతేకాకుండా శివారు గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ఆ ప్రాంతాల్లో భూములు కొనాలా..? వద్దా..? అనేది సంశయంగా మారింది. శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో బుల్లెట్ట్రైన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే సుమారు 650 ఎకరాలను కేటాయించింది.
ఇక్కడి నుంచే ముంబై, బెంగళూరు, చెన్నైలకు బుల్లెట్ట్రైన్ నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంషాబాద్ నుంచి ముంబై రూట్లో జంట జలాశయాలు ఉండటంతో ప్రభుత్వం రూటు మార్చే అవకాశాలున్నాయి. అందుకోసం జలాశయా ల్లో భాగమైన గ్రామాల గుండా వెళ్లేలా రూట్ మ్యాప్ను రెడీ చేశారు. ముఖ్యంగా గండిపేట, హిమాయత్సాగర్ ఎఫ్టీఎల్, బఫర్జోన్లు దాటిన తర్వాత వెళ్లేలా స్కెచ్ వేశారు. ఈ ప్రాంతాల్లో బుల్లెట్ట్రైన్ భూమిపై కాకుండా పిల్లర్లు వేసి వంతెన నుంచి వెళ్లేలే ప్లాన్ చేసినట్టు సమాచారం.
బుల్లెట్ట్రైన్ పిల్లర్ల కోసం గండిపేట, హిమాయత్సాగర్ పై భాగాల్లో మార్కింగ్ చేశారు. శంషాబాద్ నుంచి నర్కూడ, మొయినాబాద్ నుంచి కనకమామిడి, అప్పారెడ్డిగూడం, మేడిపల్లి, చిన్నమంగళారం, గోపాలపురం, జన్వాడ, మీర్జాగూడ, వట్టినాగులపల్లి, కోకాపేట గ్రామాల మీదుగా ఇప్పటికే పిల్లర్లకు మార్కింగ్ వేశారు. కోకాపేట నుంచి అవుటర్ రింగ్రోడ్డు మీదుగా స్టేషన్నాగులపల్లి గ్రా మంలో వికారాబాద్ రైల్వేలైన్కు ఇది కనెక్ట్ కానున్నది. కోకాపేట నియోపోలీస్ ప్రాంతాల్లో సైబరాబాద్ స్టేషన్ ఏర్పాటు కానున్నది. ఇందుకోసం బుల్లెట్ట్రైన్ రూట్ను నర్కూడ, సుల్తాన్పల్లి గ్రామాలు శంషాబాద్ మండలంలో, కనకమామిడి, మేడిపల్లి, మొయినాబాద్ మండలంలో గోపాలపురం, జన్వాడ, మీర్జాగూడం గ్రామాలు, శంకర్పల్లి మండలంలో వట్టినాగులపల్లి, కోకాపేట్ మండలాలు ఉండనున్నట్టు సమాచారం.
శంషాబాద్, శంకర్పల్లి, గండిపేట మండలాల్లోని గ్రామాల గుండా వెళ్లే బుల్లెట్ ట్రైన్ రూట్లో కోకాపేట గ్రామం మినహాయిస్తే మిగతా అన్ని గ్రామాలు జీవో 111 పరిధిలో ఉన్నాయి. ఈ గ్రామాలపై ప్రాజెక్టు ప్రభావం తీవ్రంగా చూపనున్నది. బుల్లెట్ట్రైన్ మార్గంలో రెండు పక్కల సర్వీసురోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనలున్నాయి. రోడ్ల నిర్మా ణం కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉండడంతో ఎవరి భూములు ఎంత మొత్తంలో పోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అలాగే, శంషాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి వెళ్లే బుల్లెట్ట్రైన్ కోసం కందుకూరు, యాచారం మండలాల్లో ఇప్పటికే అధికారులు మార్కింగ్ పూర్తిచేశారు. శంషాబాద్ నుంచి భారత్ ఫ్యూచర్సిటీ మీదుగా యాచారం మండలంలోని చింతపట్ల, నల్లవెల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఇప్పటికే బుల్లెట్ ట్రైన్ పిల్లర్ల కోసం మార్కింగ్ ఇవ్వడంతో ఈ గ్రామాల్లో భూ ముల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. భూ ముల కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. బుల్లెట్ట్రైన్ ప్రభావం జిల్లా రైతులపై తీవ్రంగా పడనున్నది.