కర్షకుడి గుండె చెరువైంది. ఆరుగాలం కష్టించి వేసిన పంట చేతికొచ్చే దశలో ఎండిపోవడంతో కంట కన్నీరు కారుతున్నది. పదేండ్లుగా పుష్కలమైన జలాలతో పుట్లకొద్ది వడ్లు పండించిన భూములు నెర్రెలు బారి, పైరు మాడిపోతుండడంతో రైతాంగం బిక్క మొకం వేస్తున్నది. ఇక నీరు రాదని, ఎవరూ పట్టించుకోరని తెలుసుకొని కడుపు మండి పంటకు నిప్పుపెట్టుకుంటున్నది.
సోమవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో ముగ్గురు రైతులు ఎండిన వరిని తగులబెట్టడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇది మా ముగ్గురి బాధ కాదని, జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందని, పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. నెత్తినోరు మొత్తుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదని, కాళేశ్వర జలాలను విడుదల చేయక పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– రాజన్న సిరిసిల్ల, మార్చి 11 (నమస్తే తెలంగాణ)/ఇల్లంతకుంట
రైతాంగం కడుపు మండింది. చేతికొచ్చిన పంట ఎండి పోవడంతో కన్నీరుపెడుతున్నది. సోమవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో పలువురు రైతుల నీరందక ఎండిపోయిన పైరుకు నిప్పుపెట్టారు. కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. పెద్దలింగాపూర్ ఈ యాసంగిలో వందలాది ఎకరాల్లో వరి వేశారు. ఇక్కడి పంటలకు అన్నపూర్ణ రిజర్వాయర్ జలాలే ఆధారం. గత సర్కారు కొన్నేళ్లుగా ప్రతి యాసంగిలో మధ్యమానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు నీటిని సరఫరా చేసి కాలువల ద్వారా అందించడంతో ఏబాధా లేకుండా వ్యవసాయం చేసుకున్నారు. ఈ యేడు ఎప్పటిలాగే మధ్యమానేరు జలాలు వస్తాయని నమ్మకంతో పంటలు సాగు చేసుకున్నారు.
అయితే కాంగ్రెస్ సర్కారు జలాలు విడుదల చేయకపోవడంతో కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీరందించాలని ప్రభుత్వ పెద్దలను, అధికారులను విన్నవిస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సైతం వచ్చి సిరికొండ, పెద్దలింగాపూర్ తదితర గ్రామాల్లో ఎండుతున్న పంటలను పరిశీలించారు. వెంటనే మధ్యమానేరు నుంచి నీరందించాలని డిమాండ్ చేశారు. ఎండుతున్న పంటలు చూసి రైతులు కూడా ధర్నా చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. నీళ్లు రాలేదు.
పంటలు ఎండిపోతున్నాయని, నీరందించాలని వేడుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు కలత చెందారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు అమ్ముల మహేశ్ రెండెకరాలు, అర్కాల మల్లేశం మూడెకరాలు, సలేంద్రీ పర్శరాములు మూడెకరాల పంటకు నిప్పు పెట్టి కాలబెట్టుకున్నారు. ఇది ఒక మహేశ్, పర్శరాముల బాధలు కాదు జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో కరువు తీవ్రంగా ఉందని స్థానిక రైతులు అంటున్నారు. గత యాసంగిలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వర జలాలు ఇవ్వడంతో చెక్డ్యాంలు, చెరువులు నింపుకొని సంతోషంగా ఎవుసం చేసుకున్నామని, కానీ కాంగ్రెస్ సర్కారు తీరుతో తమ బతుకులు బుగ్గిపాలయ్యాయని వాపోయారు.
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు మాకు ఏ బాధా లేదు. నట్టెండల కూడా పుష్కలమైన నీళ్లతో ఎవుసం చేసుకున్నం. అట్లనే ఈ సారి అత్తయని ఆశించి మా ఊరు పెద్దలింగాపూర్లో నాకున్న మూడెకరాల భూమిలో వరి వేసిన. మాకు అన్నపూర్ణ జలాశయమే ఆధారం. మా పంటలకు నీరందించాలని రెండు నెలల సంది అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇచ్చినం. ధర్నాలు చేసినం. ఎవరు పట్టించుకోలేదు. ఉన్న మూడెకరాల వరి ఎండిపోయింది. గొర్రెలు మేస్తున్నయి. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మేం నష్టపోయాం. ఎకరానికి 30వేలు పరిహారం అందించాలి.
– దండవేని రజినీకాంత్, రైతు, పెద్దలింగాపూర్ (ఇల్లంతకుంట )
మాది పెద్దలింగాపూర్. నాకున్న మూడెకరాల్లో వరి పెట్టిన. నీళ్లు లేక మొత్తం ఎండిపాయె. ఎనిమిదేండ్ల సంది ఏనాడు నీళ్ల కరువుచూడలే. ఇక్కడ మా బాయిలల్ల నీళ్లు కొద్దిగా తక్కువ కాంగనే అంతగిరి ప్రాజెక్టు గేట్లు తెరుస్తుండె. నీళ్లు ఒర్రెలల్ల వడి అనంతారం చెరువులకు వత్తుండె. ఒర్రెల నీరు పారితే నా బాయి గంగలెక్క ఉంటుండె. ప్రాజెక్టుల నీళ్లు లేక ఒర్రె ఎండిపాయె. నా బావి ఎడారాయె. పొలం పారే దిక్కు లేక గొర్రెలు మేపుతున్న.
– అరుకాల మల్లేశం, రైతు, పెద్దలింగాపూర్
మా పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని చెప్పినా ఎమ్మెల్యే కవ్వంపల్లి పట్టించుకోలే. మా గోస ఇనలే. అన్నపూర్ణ ప్రాజెక్టుల నీళ్లు లేక మా పొలాలు ఎండిపోవట్టి నెల రోజులైతంది. ఇప్పటికీ ఇటువైపు రానేలేదు. కాంగ్రె స్ నేతలకు చెప్పినా చప్పుడుచేత్తలేరు. ఇట్లయితే మొత్తం పంటలన్నీ ఎండుతయి. దయచూపి మధ్య మానేరు నుంచి నీరందించి మమ్ముల ఆదుకోవాలె. పంటలను కాపాడాలె. లేదంటే ఎండిన పంటకు ఎకరానికి 15 వేల పరిహారం ఇవ్వాలె.
– బెంద్రం తిరుపతిరెడ్డి, నాయకుడు