వాతావరణ మార్పులతో వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రసాయన ఎరువులు, మందులు లేనిదే పంటలు పండించలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కోనరావుపేట మండలంలోని ధర్మారంలో సత్యవతి గోశాల నిర్వాహకుడు మూగాల ప్రభాకర్ దశరథ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాడు. సేంద్రియ ఎరువులు తయారు చేసి వాటితో తీరొక్క పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. మిగతా రైతులకు తోటల సాగుపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కోనరావుపేట, జనవరి 30: హైదరాబాద్కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని (2008లో) ఏర్పాటు చేశాడు. సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలనే ఆశయంతో ముందుకుసాగాడు. హైదరాబాద్లోని గోశాల నుంచి పశువుల పేడను తీసుకువచ్చి మామిడితోట సాగు చేయగా, చెట్లు ఎదిగి మంచి కాత రావడంతో పండ్లను హైదరాబాద్లోని మార్కెట్లో విక్రయించాడు. ఇలా ఆ తోటలో లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా సేంద్రియ ఎరువులతోనే 2018లో అన్ని రకాల పండ్ల తోటలను సాగు చేయాలని సంకల్పించాడు. ఇక అప్పటి నుంచి పండ్ల తోటలు సాగు చేస్తూ సమీప గ్రామాల రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పిస్తున్నాడు.
దశరథ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, సీతాఫలం, సపోట, అరటి, టైగర్ జామున్, జామ, అల్లనేరడి, నిమ్మ, నారింజ వంటి పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ క్షేత్రంలోనే 30కి పైగా దేశీ ఆవులను సంరక్షిస్తున్నాడు. వాటి పేడతోనే స్వయంగా ఎరువులు, మందులు తయారు చేసి పంటలకు తోటలకు వేయడంతో ఎక్కువ దిగుబడి వస్తున్నది.
పశువుల ద్వారా క్రిమి మిశ్రమ ఎరువు, ద్రవ జీవామృతం, ద్రవ వృథా డికంపోజర్, అలాగే నిమ్మచెట్టు ద్వారా నీమాస్త్రమ్, వేప చెట్టు గింజలతో వేప గింజల కషాయం, దశపర్ని కషాయం, పంచగవ్య, ఘన జీవామృతం వంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉత్పత్తి చేస్తున్నాడు. దీంతో రైతులకు పెట్టుబడి భారం అధికం కాకుండా తయారీ ఖర్చు మాత్రమే తీసుకుం టూ విక్రయిస్తున్నాడు. తద్వారా పలువురు రైతులు త మ పంటల సాగులో ప్రయోగత్మకంగా వాడుతున్నా రు.కాగా, దశరథ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సమీప గ్రామాల రైతులు, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ప్రభాకర్ తయారు చేసే సేంద్రియ ఎరువులతోపాటు పండ్ల తోట, కూరగాయల సాగు బాగుందని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ ప్రశంసించారు.
భావి తరాలకు మంచి జీవితాన్ని అందించడమే లక్ష్యం గా ముందుకెళ్తున్నా. రైతులు సేంద్రియ ఎరువులు, మం దులే వాడి సాగు చేయాలి. రైతుల కోసమే నేను దశరథ సేంద్రియ వ్యవసాయ క్షేత్రా న్ని ఏర్పాటు చేశా. రైతులు తమకు వీలున్నప్పుడు వస్తే ఎరువులు, మందుల వాడకంపై అవగాహన కల్పిస్తా. భవిష్యత్ తరాల వాళ్లకు భూమాతను రక్షించి ఇవ్వడమే నా బాధ్యత. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– మూగాల ప్రభాకర్, దశరథ క్షేత్రం నిర్వాహకుడు
రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులే వాడాలి. తద్వారా పంటకు పెట్టుబడి భారం తగ్గడంతోపాటు దిగుబడి పెరుగుతుంది. భవిష్యత్ తరాలకు కూడా భూమిని సంరక్షించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించ గలుగుతాం. రైతులు అధిక మొత్తంలో రసాయనిక ఎరువులు వాడొద్దు. దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, సేంద్రియ ఎరువుల వాడకం గురించి తెలుసుకోవాలి.
– వెంకట్రావమ్మ, ఏవో (కోనరావుపేట)