యాసంగి పంటలు పూర్తి కావడం.. రోహిణి కార్తె రావడంతో రైతులు వానకాలం పంటకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, నార్లు పోయడం, తదితర పనులను చేస్తున్నారు. ఈ క్రమంలో మండలానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను అధికారులు ఇప్పటికే సిద్ధంగా ఉంచగా, వాటిని కొనుగోలు చేస్తూ తీసుకువెళ్తున్నారు.
– తిమ్మాపూర్, జూన్ 1
తిమ్మాపూర్ మండలంలో వానకాలం సీజన్లో 20వేల పైచిలుకు ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో అత్యధికంగా 18,350 ఎకరాల్లో వరి, 450 ఎకరాల్లో మక్క, 750 ఎకరాల్లో పత్తి, మిగతా విస్తీర్ణంలో కూరగాయలు, తదితర పంటలు పండించే అవకాశం ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
సిద్ధంగా ఎరువులు..
మండలానికి సరిపడా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం డీసీఎంఎస్, రైతుసేవా కేంద్రాలు, సొసైటీల్లో అందుబాటులో ఉంచింది. యూరియా 2767 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1537 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1537 మెట్రిక్ టన్నులు, పొటాష్ 1025మెట్రిక్ టన్నులతో పాటు క్రిమిసంహారక మందులను సమకూర్చింది.
విత్తనాలు రెడీ..
పంటల సాగుకు ఎరువులు, విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచారు. వరి విత్తనాలు 4587 క్వింటాళ్లు, పత్తి విత్తనాలు నాలుగు క్వింటాళ్లు, మక్క విత్తనాలు 60క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాటు పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై విక్రయించారు. ఇవే కాకుండా డిమాండ్ మేరకు మరిన్ని ఎరువులు, విత్తనాలు తెప్పించనున్నారు.
విత్తన ఎంపికలో జాగ్రత్త
వానకాలం సీజన్కు కావాల్సిన విత్తనాలు, ఎరువులను మండలంలో సొసైటీల్లో, డీసీఎంఎస్ దుకాణాల్లో సిద్ధంగా ఉంచాం. రైతులు తక్కువ ధరకు వస్తాయన్న ఉద్దేశంతో దళారుల వద్ద లూస్ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి. సీడ్స్ సైతం ప్రకటనలు చూసి మోసపోవద్దు. సీడ్స్ కొన్నప్పుడు రసీదు తప్పనిసరి తీసుకోవాలి, ప్యాకెట్పై తేదీలు, ఇతర వివరాలు తప్పనిసరి చూసుకోవాలి. విత్తనం వేసిన వెంటనే మొలక శాతాన్ని గమనించాలి. గ్రామాల్లో ఎక్కడైనా అక్రమంగా నిల్వ చేసి విత్తనాలు అమ్మితే సమాచారం అందించాలి. విత్తనాల కొనుగోలులో సూచనలు, సలహాల కోసం క్లస్టర్ వారీగా ఏఈవోలతోపాటు మమ్మల్ని సంప్రదించవచ్చు.
-సురేందర్, వ్యవసాయాధికారి, తిమ్మాపూర్