హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని అంకింతం చేసిన మహోన్నత వ్యక్తి దివంగత ఆచార్య జయశంకర్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం శాసనసభ మెంబర్స్ లాంజ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొని జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఆవశ్యకతను విద్యార్థులు, ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ అర్థమయ్యేలా వివరించారని తెలిపారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయంలో డీజీపీ ఆనంద్ నివాళులర్పించారు. ఆర్టీసీ బస్ భవన్లో సంస్థ ఈడీలు వెంకన్న, రాజశేఖర్ జయశంకర్ చిత్రపటానికి నివాళుర్పించారు. సోమాజిగూడలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్'(సెస్)లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పుష్పాంజలి ఘటించారు.