హైదరాబాద్, ఆగస్టు 6, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 93వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దీవకొండ దామోదర్రావు ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్న ఎంపీలిద్దరూ గురువారం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుకు ఆచార్య జయశంకర్ అండగా నిలిచి పోరాడారని కొనియాడారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల స్వాభిమానం, సమాన హకులు, సామాజిక న్యాయం కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కృషి చేశారని శ్లాఘించారు.