Spirit Movie | ప్రభాస్, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రల్లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’పై ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సందీప్ రెడ్డి వంగ సహోదరుడైన ప్రణయ్ రెడ్డి వంగ ఇటీవల నిర్మించిన ‘రోమాంచకం’ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శకులపై ఫైర్ అయ్యారు. సినిమా తయారీ వెనుక ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోకుండా రివ్యూలు ఇస్తున్నారని, దమ్ముంటే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా విడుదలైన తర్వాత దానిని తమ రివ్యూలతో చంపి చూడాలని ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
ఈ చిత్రంలో ప్రభాస్ శక్తివంతమైన పోలీసు అధికారిగా కనిపించనుండగా, త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మొదట దీపికా పదుకొనే హీరోయిన్గా ఎంపికైనప్పటికీ, పారితోషికం, వర్కింగ్ అవర్స్ మరియు బడ్జెట్ వంటి కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రణయ్ రెడ్డి వంగ గతంలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.