నాంపల్లి, సెప్టెంబర్ 12 : దౌర్జన్యంగా తమ ఇండ్ల స్థలాలను కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సుంకిశాల గ్రామానికి చెందిన గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం నాంపల్లి మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన గ్రామస్తులు కబ్జాకు గురి అవుతున్న స్థలం వద్ద టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 30 ఏండ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సుజాతమ్మ దేవి దగ్గర భూమిని కొనుగోలు చేసి అక్కడే ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉన్నాం. అక్కడ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించక లేకపోవడంతో అక్కడి నుండి రోడ్డు మీదకు వచ్చి ఇండ్లను నిర్మించుకుని ఇక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం అక్కడ ఉన్న ఇండ్లను తుమ్మలపల్లి రాజవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా జెసీబీ సహాయంతో ఆ ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేసి తమ ఇండ్ల స్థలాలను, గ్రామ కంఠం భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడన్నారు.
ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడుతూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్ల నిర్మాణాలు ఉండగానే ఆ భూమిని రెవెన్యూ అధికారులు అతడికి పట్టా చేశారని అంటున్నాడని, తమ ఇండ్లు ఉండగా రెవెన్యూ అధికారులు ఏ విధంగా పట్టా చేస్తారని ప్రశ్నిస్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ కంఠం భూమిని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని తమ ఇండ్ల స్థలాలను కాపాడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బాధితులు బాసిపాక రాములు, బుడియాపాక లక్ష్మయ్య, ఆడపల్లి జయమ్మ, పిల్లి లక్ష్మమ్మ, ఎరుకల ఆంజనేయులు, కలకొండ లక్ష్మయ్య, బుడియాపాక వెంకటయ్య, అబ్బనబోయిన లక్ష్మమ్మ, పల్లపు శోభన్ బాబు, హరికృష్ణ, మద్దిమడుగు మల్లయ్య, అబ్బనబోయిన మల్లమ్మ, ఎడమ మల్లేష్, యాదయ్య, సైదులు, రమేష్, వంశీ పాల్గొన్నారు.