BRICS Bloc : బ్రిక్స్ దేశాలు ఉమ్మడి తీర్మానంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. శుక్రవారం రాత్రి నుంచి వేకువఝామున 4.00 గంటల వరకు జరిగిన చర్చల అనంతరం తీర్మానంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఏకపక్షంగా జరుగుతున్న యుద్ధాల్ని ఖండించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. అయితే, ఈ తీర్మానంలో ప్రత్యేకంగా ఏ దేశాన్నీ ప్రస్తావించలేదు. ఈ తీర్మానంపై ప్రకటన ఈ రోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉంది.
నిజానికి ఇది క్లిష్లమైన నిర్ణయం. ఎందుకంటే ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో ఉండి, సదస్సులో పాల్గొంటున్న ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఆయా దేశాల మధ్య ఒక తీర్మానంపై ఏకాభిప్రాయం కుదర్చడం సాధ్యం కాదు. కానీ, భారత దౌత్యనీతి, దేశం అనుసరిస్తున్న ప్రమాణాల ద్వారా ఏకాభిప్రాయం కుదిరింది. ఆయా దేశాల మధ్య ఉన్న బేధాభిప్రాయాలను పక్కనబెట్టి.. ఒప్పందం కుదిరేలా ఇండియా వ్యవహరించింది. ఈ తీర్మానంపై చివరగా సభ్య దేశాధినేతలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
అనంతరం దీనిపై ఉమ్మడిగా ప్రకటన చేస్తారు. ఈ సందర్భంగా దేశాధినేతలు కూడా పాల్గొంటారు. ప్రస్తుతం కూటమి దేశాల మధ్య వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సు జరిగే భారత్ మండపం వద్దకు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అబుదాబి రాజు ప్రిన్స్ ఖలేద్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ అక్కడికి చేరుకున్నారు. సమ్మిళిత ప్రపంచ పరిపాలన, బహుళపక్షపాతవాదాన్ని బలపరచడం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సదస్సు ఆదివారం కూడా జరగనుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఈరోజే ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా దేశాధినేతలు కూడా పాల్గొంటున్నారు.