కరీంనగర్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ను కలుపుకొని 13 అంసెబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 31,78, 980 మంది ఓటర్లు ఉండగా, అందులో 24,56,146 మంది ఓటు (77.26 శాతం) హక్కును వినియోగించుకున్నారు. అందుకు సంబంధించి హుస్నాబాద్ మినహాయిస్తే.. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జిల్లాల్లో ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలోనే ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత నెల 30న ఎన్నికలు పూర్తి కాగానే.. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలోకి తరలించారు. సదరు స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేటి కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లూ చేశారు.
నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఎస్సారార్ కాలేజీలో నిర్వహించనున్నారు. అలాగే జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించి మల్యాల మండలం పోతారం సమీపంలోని వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో.. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు సంబంధించి రామగిరి జేఎన్టీయూ కళాశాలలోని అకాడమిక్ బ్లాక్- 2లో.. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో కౌంటింగ్ చేయనున్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిద్దిపేటలోని ఇందూరు కళాశాలలో లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం 8 గంటల నుంచే నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ను లెక్కిస్తారు. అర గంట వరకు ఈ లెక్కింపును పూర్తి చేసి, 8.30 గంటల నుంచి ఈవీఎంలో ఉన్న ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు 14 టేబుళ్లు వేశారు. ఒక్కో రౌండ్లో ఒక్కో పోలింగ్ కేంద్రం ఈవీఎంను ఒక టేబుల్కు ఇస్తారు. అలా ఒక రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలో ఉన్న ఓట్లను కౌంట్ చేస్తారు.
ఒక రౌండ్ పూర్తయిన తర్వాత మరో రౌండ్ కౌంటింగ్ ప్రారంభిస్తారు. ప్రతి రౌండ్లోనూ టేబుల్ వారీగా ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను క్రోడీకరించి.. వాటిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని, అన్ని కరెక్టుగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే జిల్లా రిటర్నింగ్ అధికారి సంతకంతో ఆ రౌండ్ ఫలితాలను బయకు విడుదల చేస్తారు. ఒక్కో టేబుల్కు నలుగురు సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఆయా పార్టీల నుంచి అధికారికంగా గుర్తించి అధికారులు ధ్రువీకరించిన ఏజెంట్లు మాత్రమే హాజరవుతారు.
ఓట్లు ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూంలకు చేపట్టిన భద్రతా చర్యలను కౌంటింగ్ ముగిసే వరకు కొనసాగిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు 144 సెక్షన్ విధించడంతోపాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలు అమర్చారు. లెక్కింపు కేంద్రాల్లో బారికేడ్లు అమర్చారు.
విధులు నిర్వహించే సిబ్బందికి, అభ్యుర్థుల తరఫున వచ్చే ఏజెంట్లకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. వీరిని మాత్రమే కౌంటింగ్ హాళ్లకు అనుమతించనున్నారు. మొబైల్ ఫోన్లు, పేపర్లు కౌంటింగ్ హాలులోకి అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే, మద్యం అమ్మకాలపై నిషేధం ఉందని, రోడ్లపై ర్యాలీలు, పటాకలు కాల్చడం, ఊరేగింపులు చేయరాదని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు.
విజయం కోసం ఎన్నడూ లేనంతగా ఈసారి అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఈ నెల 28వ తేదీ చివరి వరకూ విశ్వప్రయత్నాలు చేశారు. ఈ దశలో ఎవరికి వారే గెలుపు తమదేనని చెబుతున్నారు. నేటి మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడనుండగా, విజయం ఎవరిని వరిస్తుందో తెలిసిపోనున్నది. అయితే, ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నా, లోలోపల మాత్రం టెన్షన్ కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 24.56 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్ను తేల్చనుండగా, ఈసారి ప్రతి నియోజకర్గంలోనూ ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తున్నది.
పోలింగ్ నిశబ్దంగా సాగిన నేపథ్యంలో ఓటరు నాడి ఎవరికీ అంతు చిక్కకుండా ఉన్నది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రెండు రోజులుగా వస్తున్న ఎగ్జిట్ పోల్స్పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈరోజు వెల్లడయ్యే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు అనుగుణంగా ఉంటాయా..? లేక తారు మారు అవుతాయా..? గుమ్మనంగా సాగిన ఓటింగ్ ఎవరి విజయానికి అనుకూలంగా మారుతుందో.. విషయం తేటతెల్లం కానుండగా, అన్నీ పార్టీల అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ నెలకొన్నది.