కోనరావుపేట, జనవరి 21: పత్తి పంట వేసిన రైతన్నకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది. ఓ వైపు వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు రోజురోజుకూ మార్కెట్లో ధర పడిపోతున్న ది. దీంతో గిట్టుబాటు ధర లభించక పత్తి రైతు దిగాలు చెందుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆది నుంచే పత్తి తక్కువ ధర పలుకుతున్నది. అక్టోబర్లో క్వింటాల్ పత్తి ధర అత్యధికంగా 7,200 పలుకగా, ఆ తర్వాత సీసీఐ క్వింటాల్కు 7,020 నిర్ణయించింది.
ఈ ధరకే మార్కెట్లో విక్రయించేందుకు అందుబాటులో ఉన్న జిన్నింగ్ మిల్లుల వద్ద వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో కోనరావుపేట మండలంలోని సుద్దాల, వేములవాడ రూరల్ మండలంలోని సంకెపల్లి, నాంపెల్లి గ్రామాల్లోని పత్తి జిన్నింగ్ మిల్లులకు రైతులు నేరుగా ట్రాక్టర్లో పత్తిని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అయితే అక్కడ తేమశాతం ఎక్కువ ఉందని, నాణ్యతలేదంటూ కొర్రీలు పెట్టి మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గతేడాది పత్తి ధర అత్యధికంగా 9,500 వరకు పలుకగా, ఈసారి 7,020 నుంచి 6,920 కి పడిపోయింది. ఈ క్రమంలో పల్లెల్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ రేటు కు కొనుగోలు చేస్తున్నారు. ఎగుమతి ఖర్చులు రైతులకు వేస్తూ క్వింటాల్కు 6,500 కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగి న డిమాండ్ లేకపోవడంతో ధర కూడా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.