వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిపోవడంతో పత్తి రైతులు దిగులు పడుతున్నారు. దిగుబడి తగ్డిపోయి పెట్టుబడి కూడా చేతికి రాక ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం ఏడు నుంచి పది క్వింటాళ్లే రావడంతో కుదేలవుతున్నారు. మార్కెట్లో గరిష్ఠంగా రూ. 7020 మాత్రమే పలుకుతుండడంతో అప్పుల భారం పెరిగిపోతుందని మదన పడుతున్నారు.
– కోనరావుపేట, జనవరి 7
రెండుమూడేండ్లుగా లాభాల మురిసిపోయిన పత్తి రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. రైతులు పెద్ద ఎత్తున కౌలు తీసుకుని పత్తి పంటను సాగుచేశారు. విత్తనం విత్తిన తర్వాత కొన్నిరోజులు వానలు పడలేదు. దీంతో పూర్తిస్థాయిలో విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ నాటారు. ఆతర్వాత వర్షాలు భారీగా కురిశాయి. దీంతో చెట్లు ఏపుగా పెరిగి, పూతకు రాగా దిగుబడి బాగా వస్తుందని రైతులు మురిసిపోయారు. కానీ కాత దశకు రాగానే వానలు పడకపోవడంతో పూత రాలిపోవడం, ఉన్న కాయనే చేనులో నిలిచిపోయింది. దీంతో దిగుబడి తగ్గిపోయింది. మార్కెట్లో మంచి ధర ఉంటే పెట్టుబడి నిండుతుందని ఆశించిన నిరాశే ఎదురైంది. దీంతో దూది పండించిన రైతన్న ఇంటా దు:ఖమే మిగిలింది.
గతేడాది నల్లరేగడి, ఎర్ర భూముల్లో రైతులు పత్తి వేయగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో కూడా రూ.8 వేల నుంచి రూ. 9 వేల ధర పలికింది. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో 33748 మంది రైతులు 54,489 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. దీంతో అత్యధికంగా పెట్టుబడి పెట్టిన ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్లే వస్తుందని కర్షకులు వాపోతున్నారు. ప్రభుత్వం సీసీఐ కేంద్రాల్లో క్వింటాల్కు రూ.7020ని ధర నిర్ణయించింది. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తూ వారు చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ధర మరో రూ.100 తగ్గ డం, దళారులు రూ.6400కే కొనుగోలు చేయడంతో రైతు నష్టాలను చవిచూస్తున్నారు.
రెండెకరాల్లో పత్తితో పాటు 8 ఎకరాల కౌలు తీసుకున్నాను. ఎకరాన 12వేలు చెల్లించి పత్తి వేస్తే కేవలం ఎకరాన 6 నుంచి 7 క్వింటాళ్ల వరకు పత్తి వచ్చింది. మార్కెట్లో మంచి ధర లేదు. సీసీఐ 7,020 క్వింటాల్కు కొనుగోలు చేస్తే, తేమ శాతంతో రాకపోవడంతో 6,400 ధర పలుకుతుంది. పెట్టుబడి రాక నష్టాలపాలయ్యాను.
– రాచర్ల ప్రశాంత్, రైతు, మూడపల్లి
నాకున్న నాలుగెకరాలతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకు న్నా. సరైన సమయంలో వానలు పడకపోవడంతో రెండు, మూడు సార్లు విత్తనాలు పెట్టాల్సి వచ్చిం ది. పత్తి పూత, కాత సరిగా లేక నష్టం వాటిల్లింది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల పత్తి వచ్చింది.
-దండు మోహిలి, రైతు, కోనరావుపేట
వాతావరణ ప్రభావంతో పత్తి పంట దిగుబడి తగ్గింది. రైతులు పంట మార్పిడి చేసి, అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే దిగుబడి ఎక్కువ మొత్తంలో సాధించవచ్చు.
– వెంకట్రావమ్మ, ఏవో కోనరావుపేట