ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సర్కారు గతేడాది తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లల్లో మౌలిక భాషా, గణితంపై పట్టు సాధించేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. మాదిరి వార్షిక, పాఠ్య, రోజు వారి పీరియడ్ పథకాలను తయారు చేసి ఉపాధ్యాయులకు అందిస్తున్నది. ఈ కార్యక్రమంపై టీచర్లకు ఏటా మూడు రోజులు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
– పెద్దపల్లి కమాన్, జూలై 30
ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలు లేవని గుర్తించిన ప్రభుత్వం గత విద్యాసంవత్సరం 2022-23 ఆగస్టు 15న తొలిమెట్టు కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. సెంట్రల్ స్కేర్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ప్రతి మండలం నుంచి సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున 84 మంది ఉపాధ్యాయులకు శిక్షణకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదల ప్రణాళికలను, పీరియడ్ ప్లాన్ వర్క్ షీట్ ప్రతి పాఠశాలకు అందజేశారు. పీరియడ్ ప్లాన్, వర్క్షీట్ల ద్వారా విద్యార్థుల్లో పఠనాసక్తిని కలిగించి, అభ్యసన సామర్థ్యాలను పెంచి, నాణ్యమైన విద్యను అందించడమే విద్యాశాఖ ముఖ్య ఉద్దేశ్యం..
ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపునకు విద్యాశాఖ తొలిమెట్టును ప్రారంభించింది. యేటా ప్రతి మండలానికి ఇద్దరి చొప్పున టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. గుణాత్మక విద్యనందించినప్పుడే పిల్లలు భవిష్యత్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రైమరీ స్టేజ్లో విద్యార్థులు ధారాళంగా చదవడం, రాయడం, పాఠ్యాంశాల్లోని కనీస అభ్యసన సామర్థ్యాలను కలిగి ఉండి ఉన్నత స్థాయిలోని పాఠశాలలో చేరే వరకు మౌలిక, భాషా, గణిత సామర్థ్యాలను పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.
– డీ. మాధవి, డీఈవో, పెద్దపల్లి
అర్థవంతమైన బోధన.. అభ్యాస సాధన
పాఠశాల విద్యాభ్యాసంలో ప్రాథమిక విద్య పునాది లాంటిది. ఈ దశ పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ఆయా సబ్జెక్టుల్లో నిర్దేశిత సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు సాధించినప్పుడే గుణాత్మక విద్యను అందించినట్లవుతుంది. మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన జరిగినప్పుడే ఎలిమెంటరీ, ఉన్నతస్థాయిల్లో ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది. విద్యా లక్ష్యాల సాధనకు మార్గం సుగమవుతుంది. ఒకటి నుంచి ఐదు తరగతుల కోసం వార్షిక ప్రణాళిక, యూనిట్, పాఠ్య ప్రణాళిక, రోజు వారి పీరియడ్, విద్యార్థుల సాధన కోసం కృత్య పత్రాలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ రూపొందించింది. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు ఆయా తరుగతుల వారిగా బోధనాభ్యాసన ప్రక్రియను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వర్క్షీట్స్ ద్వారా బోధిస్తారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో బోధనాభ్యస ప్రక్రియల నిర్వహణ-పిల్లల ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సూచనలు అందించడానికి మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.