సారంగాపూర్, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో దొంగలు పడ్డ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉన్నదని, ఆచరణ సాధ్యం కాని 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి ఒక ఝూటాకోర్ అని ధ్వజమెత్తారు. తనను ఎంపీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో కొట్లాడుతానని హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్, రేచపల్లి, బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎన్నికల ఇన్చార్జ్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కంటే డబుల్ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మంచి మోసం చేసిన వ్యక్తి రేవంత్రెడ్డి అని ధ్వజమెత్తారు. ఆశతో కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోయామని ప్రజలు చెపుతున్నారని తెలిపారు. ఈసారి న్యాయం చేసే వారికే ఓటు వేయాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా అభివృద్ధికి నిధులు తీసుకురాలేని అసమర్థుడు ధర్మపురి అర్వింద్ అని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రజల చెవిలో పువ్వు పెడితే, కాంగ్రెస్ ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టిందన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మోజర్టీతో గెలిపించాలని విజ్జప్తి చేశారు.
ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కరువు వచ్చిందని, రానున్న రోజుల్లో మరింత తీవ్రం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎంత ఉన్నదో ఇప్పటికే ప్రజలకు అర్ధమైందన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర పైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేంశంగౌడ్, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్రెడ్డి, వైస్ఎంపీపీ సొల్లు సురేందర్, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్రెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్రావు, మండల యూత్ అధ్యక్షులు మధుకుమార్, నాయకులు సుధాకర్రావు, ఢిల్లీ రామారావు, మల్లేశం, లింగారెడ్డి, రవి, లింగరెడ్డి, మల్లేశం రమేశ్, మహేశ్ పాల్గొన్నారు.