సిరిసిల్ల టౌన్, మార్చి 30 : అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మున్సిపల్ పాలకవర్గంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై తాము పూర్తి స్పష్టతనిచ్చామని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ నేతలు అవే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టెండర్ లేకుండా బిల్లులు తీసుకున్నారని, సీసీరోడ్డు వేయకుండానే బిల్లులు పొందారని నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలతో పాలన అందిస్తుంటే స్థానిక నాయకులు ఆయన బాటలోనే ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.55కోట్ల నిధులతో టెండర్ చేశారని, మీకు చేతనైతే సదరు టెండర్ పూర్తిచేసి పట్టణంలో అభివృద్ధి పనులు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. అనవసరమైన మాటలు మానుకోపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శవాలపై పైసలు ఏరుకునే కొంత మంది నాయకులు చేసిన ఫిర్యాదుతో అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన కార్మికుల వేతనాలు నాలుగు నెలలుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.101తో అంత్యక్రియలు నిర్వహిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని సైతం తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వేతనాలు రాని కార్మికులు రోడ్డెక్కితే కాంగ్రెస్ నాయకులే బాధ్యులు అవుతారన్నారు. మున్సిపాలిటీలో లేబర్ల నియామకంలో అక్రమాలు జరిగాయని చెప్పిన వ్యక్తి తాను స్వయంగా టెండర్ నిర్వహించినప్పుడు రూ.5వేలు మాత్రమే వేతనాలు ఇచ్చాడన్నారు. తమ పాలనలో అవినీతికి తావులేకుండా కార్మికుడి బ్యాంకు ఖాతాలో నేరుగా వేతనాలు అందించామన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అవినీతికి తావులేకుండా అభివృద్ధి లక్ష్యంగా తమ పాలకవర్గం పని చేసిందన్నారు. మీరు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
మున్సిపల్ జనరల్ ఫండ్పై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అవగాహన లేని ఆరోపణలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, కల్లూరి రాజు మాట్లాడుతూ, గత పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న నాయకులే పాలకవర్గంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. అధికార పార్టీలో ఉన్న నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంలో ఉన్న మీరు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర పాలనలో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదన్నారు. అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలుచుకోవాలి కానీ, తప్పుడు ఆరోపణలు చేసి మున్సిపాలిటీని అభాసుపాలు చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, గడ్డం భాస్కర్, మ్యాన రవి, ఒగ్గు రాజేశం, సత్తార్, ఎరవెల్లి వెంకటరమణా రావు, సబ్బని హరీశ్, రిక్కుమల్లె సంపత్, బండారి శ్యాం, ప్రభుదాస్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.