Jagityal | జగిత్యాల, అక్టోబర్ 12 : బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ తో బీసీ సమాజాన్ని అయోమయానికి గురి చేసిందన్నారు.
బీసీ కులాలను ఆశల పల్లకిలోకి నెట్టి, చెల్లని జీవోతో బీసీ సమాజం తో చెలగాటం ఆడిందన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం పోగొట్టిందని, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసమే బీసీలను వాడుకుందని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీల కోసం కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యం అని అన్నారు. గవర్నర్ దగ్గర, అటు రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో 9తో ఎన్నికలకి ఎలా వెళ్తారనే సోయి అటు ప్రభుత్వంకు, ఇటు ప్రభుత్వ, పార్టీ పెద్దలకు, సలహాదారులకు లేకపోవడం విచారకరం అన్నారు. కేవలం బీసీల ఉద్దారణకు తామేమో చేస్తున్నామన్న భ్రమను కల్పించేందుకు కుప్పి గంతులు వేసి మభ్య పెట్టాలని చుసిన వ్యూహం బెడిసి కొట్టిందన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో బీసీల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలు కనుమరుగయ్యాయని విమర్శించారు. గంగపుత్ర, ముదిరాజ్ లకు సంబంధించిన చేపల పంపిణీ నేటికీ అరంభం కాకపోవడమే ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. గౌడన్నలకు చెట్టు పన్ను మాఫీ చేసి, ప్రమాదవశత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా కల్పించి, గొల్ల కురుమలకు గోర్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. బీసీల విద్యకై అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్య, భోజనం అందించిందన్నారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి దుర్బరంగా మారిందన్నారు. బీసీలకు రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కానీ సుప్రీం కోర్డు నెపంతో మరోమారు ఎన్నికల వాయిదా కోసం ప్రభుత్వమే కృషి చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా బీసీ సమాజం మేల్కొని కాంగ్రెస్ కపట వైఖరిని గమనించాలని కోరారు. బీసీల చైతన్యంతోనే రాజ్యాధికారం సాధ్యమని, ఆ దిశగా బీసీ సమాజం ముందుకు సాగాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కొంత మంది బీసీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కు అనుకూలంగా వ్యవహరించడం విచకరమని, బీసీ సమాజం కోసం పోరాటంకు సిద్ధమవ్వాలని సూచించారు. .ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎప్పటికైనా తెలంగాణకు కేసిఆర్ శ్రీరామరక్ష అని అన్నారు. ఈ సమావేశం లో మండల అధ్యక్షుడు ఆనంద్ రావు, మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్, బీఆర్ఎస్లో నాయకులు బందేల శేఖర్, మహేష్ గౌడ్, రాకేష్, వెంకటేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.