గోదావరిఖని, మే 2 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రతో కాంగ్రెస్ నాయకులకు భయం పుట్టిందని, అందుకే కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బస్సు యాత్రను మాత్రమే ఆపగలిగారని, కానీ, ప్రజల్లో ఉన్న ఆదరణను మీరు ఆపలేరని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈమేరకు గురువారం ఖని చౌరస్తాలో ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారని, బస్సుయాత్రను అడ్డుకోవడం పిరికిపంద చర్య అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన చరిత్ర కేసీఆర్దేనని కొనియాడారు.
ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు వెళ్లిన చరిత్ర తనదని, ఐదో వేజ్బోర్డు అమలు కోసం ఆరు రోజులు జీఎం ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. ఉద్యమం చేసి ఇన్కం టాక్స్, వేజ్బోర్డు, తదితర వాటిని అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వపు ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరించామన్నారు. లాభాల వాటా 18 శాతాన్ని 32 శాతానికి పెంచిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే కార్పొరేట్ నాయకులకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు వివేక్, మక్కాన్ సింగ్కు అసలు సింగరేణి చరిత్ర గురించి తెలుసా? అని నిలదీశారు. వారికి చలో చలో అనే పేరు ఎందుకు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఎద్దేవా చేశారు.
సినిమాలు చూసి డైలాగులు చెప్పడం కాదని, సింగరేణి కార్మికుల కోసం వారు ఎలాంటి పోరాటాలు చేశారో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే వివేక్ ఇప్పుడు తన కొడుకును కూడా తన బాటలోకి తీసుకవస్తున్నారన్నారు. పెద్దపల్లి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన వివేక్ తండ్రి ఇక్కడ ఎందుకు ఫ్యాక్టరీలు పెట్టలేదని, అంతర్గాం మిల్లును ఎందుకు ప్రారంభించలేకపోయారని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు పెంట రాజేశ్, అంజలీదేవి, సరోజన, కవిత సరోజని, నాయకులు కౌశిక హరి, జావిద్ పాషా, గోపు ఐలయ్య, చిప్ప రాజేశం, అడప శ్రీనివాస్, దేవరాజ్, పీటీ స్వామి, మురళీధర్ రావు, ముద్దసాని సంధ్యారెడ్డి పాల్గొన్నారు.