
Koppula Eshwar | జగిత్యాల, ఫిబ్రవరి 3 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీ-ఫాం పై పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు కొప్పుల దిశానిర్దేశం చేశారు. జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన వెంకటేశ్వర్ రావుని కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని ప్రజలకు స్పష్టంగా వివరించాలని అభ్యర్థులకు సూచించారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఎదుటి పార్టీల బెదిరింపులు, కవ్వింపులకు భయపడొద్దని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మన సర్కారే వస్తదని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్ పై ఉందని, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని, అందుకు అంతా కలిసి శ్రమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.