గొల్లపల్లి, సెప్టెంబర్ 14: ‘రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదు. సొంత లాభం చూసుకున్నారే గానీ, ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధిపై ఎజెండా లేదు. దొంగ మాటలతో గెలవాలని చూస్తున్నరు’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. గురువారం గొల్లపల్లి మండలం ఆత్మకూర్, దమ్మన్నపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఆశీర్వాద యాత్ర చేశారు.
ఆయాచోట్ల మహిళలు బతుకమ్మలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి.. గ్రామాల్లో వీధివీధినా తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలందనీ కలుస్తూ కష్టసుఖాలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడారు. సీం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలిపితే కాంగ్రెస్, బీజేపీలు జీర్ణించుకోలేక పోతున్నాయని, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని గ్రామాల్లో తిరుగుతున్నారని, ఇన్నాళ్లూ ఎక్కడికి పోయారని విమర్శించారు. వారిని గ్రామ పొలిమేరలకు రాకుండా తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేస్తున్నదని, ప్రజలను మోసం చేసేందుకు బీసీ, ఎస్సీ డిక్లరేషన్ల పేరిట నమ్మించాలని చూస్తున్నదని ఆరోపించారు. దళిత బంధు 12 లక్షలు, పింఛన్ నెలకు 4వేలు ఇస్తామంటున్న కాంగ్రెస్, వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీతో నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్నామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నామని చెప్పారు. పల్లె ప్రగతితో ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా ధమాషా ప్రకారం నిధులు ఇస్తున్నామని చెప్పారు.
దళిత బంధుతో దళితుల తలరాత మారుతున్నదని, అభ్యున్నతి సాధిస్తున్నారన్నారు. ఇప్పటికే తొలి ఏడాది రాష్ట్రంలో 40 వేల మందికి ఇచ్చామని, ఈ యేడాది మరో 2 లక్షల మందికి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ర్టాభివృద్ధికి పాటుపడుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరోసారి అధికారంలోకి తేవాల్సిన బాధ్యత మీపైనే ఉందని చెప్పారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూసే కాంగ్రెస్, బీజేపీకి బుధ్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు తిరుపతి, అమృత, మల్లవ్వ, ఎంపీటీసీ నంద, ఫాక్స్ అధ్యక్షులు రాజసుమన్ రావు, వెంకట మాధవ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, వైస్ చైర్మన్ లింగా రెడ్డి, వైస్ ఎంపీపీ సత్తయ్య, యూత్ నాయకులు రవీందర్, రాంచదర్ రెడ్డి, గంగాధర్, రాజేందర్, నాయకులు రమేశ్, తిరుపతి, చంద్రయ్య, రాజిరెడ్డి, రవి పాల్గొన్నారు.