కలెక్టరేట్, మార్చి 3: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పార్కు(సర్కస్ గ్రౌండ్)లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిర్వహించిన చర్చాగోష్టికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, బాలికలు, యువతులపై అఘాయిత్యాలు జరిగితే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇతరుల నుంచి వచ్చే ఆపదలను ఎదుర్కొనేందుకు మహిళలు ధైర్యంగా ఉండాలన్నారు.
జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి, న్యాయమూర్తి సుజయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా ఆదాయం సంపాదిస్తున్నారని, అయినప్పటికీ వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభించడం లేదన్నారు. మహిళా చట్టాల గురించి వివరించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు. బాల్యవివాహాలు అరికడితే మహిళల జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. కుటుంబ పురోగతి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండాలని సూచించారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి సబితాకుమారి, డీసీవో శ్రీమాల, మార్కెటింగ్ డీడీ పద్మావతి, ఇన్చార్జి డీసీపీవో శాంత, సీడీపీవో ఉమారాణి, ఏసీడీపీవోలు, తదితరులు పాల్గొన్నారు.