కలెక్టరేట్, ఏప్రిల్ 19 : పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు పరిధిలో మొత్తం ఓటర్లు 17,91,970 మంది ఓటర్లు ఉండగా, వీరిలో అత్యధికం మహిళలేనని చెప్పారు. సెగ్మెంట్లో 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన వసతులు కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో 64.49 శాతం ఓట్లు పోలింగ్ కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 74.5శాతానికి పైగా పోలైనట్లు వివరించారు. ఈసారి 80శాతం వరకు పోలింగ్ జరిగేలా వినూత్న కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు మహిళా పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగుల కోసం ఒక్కో పోలింగ్ కేంద్రం, యువత కోసం ఒకటి, ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
అత్యవసర విధులు నిర్వహించే వారు, పోలింగ్ విధుల్లో ఉండే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. హోం ఓటింగ్కు అర్హులైన వారు 54,730 మంది ఉండగా, దరఖాస్తు చేసుకునేందుకు 12డీ ఫారాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మే3 నుంచి హోం ఓటింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సెన్సియల్ ఓటర్లు 15 వేల మంది వరకు ఉండగా, వీరికి కూడా 12 డీ ఫారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం 12 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అవకతవకలపై ఈసీఐ అందుబాటులోకి తెచ్చిన సీవిజిల్ యాప్ ద్వారా ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఇప్పటివరకు 68 ఫిర్యాదులు రాగా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ, చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారం కోసం నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు అవసరమైన అనుమతులు సువిధ యాప్ ద్వారా మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 168 అర్జీలు రాగా, 105 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. గత నవంబర్ నెల నుంచి ఇప్పటివరకు 84,620 ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్విన్కుమార్పాండే శుక్రవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతిని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన అనంతరం డీఈవో మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు పరిశీలకులు జిల్లాలోనే ఉండి, ఎన్నికల వ్యయానికి సంబంధించిన అన్ని అంశాలు పరిశీలిస్తారని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులున్నా వ్యయ పరిశీలకుడు అశ్విన్కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531కు ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
కాగా, కలెక్టరేట్లోని మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ను ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్విన్ కుమార్ పాండే పరిశీలించారు. మీడియా సెంటర్ పనితీరుతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కొండయ్య, ఏపీఆర్వో వీరాంజనేయులు, కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి ఎస్.నాగార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాను ర్యాండమ్గా రాజకీయ పార్టీల నేతలు చెక్ చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలింగ్ బూత్ల పేర్లు, స్థల మార్పిడి, అదనంగా ఏర్పాటు చేసే పోలింగ్ బూత్ల అంశంపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కులంకషంగా చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బీ శ్రీనివాస్, ఆయా రాజకీయ పార్టీల నేతలు సత్తినేని శ్రీనివాస్, మడుపు మోహన్, కళ్యాడపు ఆగయ్య, వెంకటరమణ, నాంపల్లి శ్రీనివాస్, బరత్ అలీ, మిలురి వాసుదేవ రెడ్డి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు