కలెక్టరేట్, ఫిబ్రవరి 16: హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె హరితహారంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయడంతో పాటు వాటికి రికన్షలేషన్ చేపట్టాలని సూచించారు.
అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు మొక్కలు నాటాలని, జిల్లాలో పెరిగిన మొక్కలను తొలగించాల్సి వస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి, పీఆర్, లోకల్ బాడీస్ అధికారుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. ఇంటింటికీ ఇచ్చే మొక్కల్లో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలకు ప్రాధాన్యమివ్వాల న్నారు.
ఇచ్చిన మొక్కల సంరక్షణను వారం రోజులకోసారి పర్యవేక్షించాలని ఆదేశించారు. పాలీ ప్రీ నర్సరీలు తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అటవీశాఖాధికారి బాలమణి, డీఆర్డీవో శ్రీధర్, డీఏవో ప్రియదర్శిని, మెప్మా పీడీ రవీందర్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.