కలెక్టరేట్, జనవరి 17: సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు నమోదు దరఖాస్తుల పరిష్కారం సహా పలు అంశాలపై బుధవారం ఆర్డీవోలు, తహసీల్దార్లకు కలెక్టర్ ఐడీవోసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ప్రతి రోజూ అన్ని రైస్ మిల్లులు పనిచేసేలా మానిటర్ చేయాలని సూచించారు.
ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. అనంతరం ధరణి, ఇతర భూ సంబంధిత సమస్యలపై సమీక్షించారు. హైకోర్టు, ఇతర ఉన్నత న్యాయ స్థానాల్లోని పెండింగ్ కేసుల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలన్నారు. కోర్టు ఆర్డర్ ప్రకారం అర్జీలను పరిష్కరించాలన్నారు. భూ సంబంధిత ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. అలాగే మీసేవ సర్వీసెస్ పెండింగ్పై సమీక్ష నిర్వహించారు. కుల, ఆదాయ, తదితర సర్టిఫికెట్లు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఫా రం-6,7,8 దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
ఓటరు జాబితాలో డబుల్, డూప్లికేట్, డెత్ ఓటర్లు లే కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండిన విద్యార్థుల వివరాలను సేకరించి, ఎవరైనా ఓటు హక్కు నమోదు చేసుకోకుంటే వారు వెంటనే నమోదు చేసుకునేలా చూడాలన్నారు. శనివారం సాయంత్రం వరకు ఏ మండలాల్లో అతి ఎక్కువ ధరణి పెండింగ్ అర్జీలు ఉంటే సంబంధిత టాప్ 3 మండలాల తహసీల్దార్లు సోమవారం కలెక్టరేట్కు వచ్చి క్లియర్ చేయాలని ఆదేశించారు.
అలాగే నాబార్డు సౌజన్యంతో చేపట్టే జీవనోపాధుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై నాబార్డు, గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శిక్షణకు ఆసక్తి చూపే నిరుద్యోగ యువత, స్వయం సహాయక సంఘాలను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని ఆర్అండ్ఆర్ కాలనీల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. శిక్షణతోపాటు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్, ైస్టెఫండ్, వసతి సౌకర్యం కూడా ఉంటుందన్న విషయాన్ని యువతకు, స్వయం సహాయక సంఘాలకు తెలియజేయాలన్నారు. శిక్షణ పొందిన తర్వాత ఉమ్మడిగా సంఘాలు లేదా అభ్యర్థులు రూరల్ మార్ట్ పేరుతో యూనిట్లు పెట్టుకుంటే నాబార్డు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు.
కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ను డోర్స్ నూతన కార్యవర్గం సభ్యులు బుధవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ఎంపికను కలెక్టర్కు తెలియజేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అధికారుల అసోసియేషన్(DOARS) నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఇటీవలే జరిగింది. డోర్స్ ఫౌండర్ చైర్మన్గా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఉండగా, అధ్యక్షుడిగా జిల్లా రవాణా అధికారి కొండల్రావు, జనరల్ సెక్రటరీగా వినోద్కుమార్, కోశాధికారిగా శ్రీనివాసాచారి, ప్రచార కార్యదర్శిగా మామిండ్ల దశరథం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డోర్స్ నూతన కార్యవర్గ సభ్యులను కలెక్టర్ అభినందించారు.