కలెక్టరేట్, ఫిబ్రవరి 3: ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా తయారీ, ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీపై రాజకీయ పార్టీల నాయకులతో సమీకృత కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ నెల 5 నుంచి ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ ప్రారంభం కానుందన్నారు. ఈసీఐఎల్ ఇంజినీర్లు, పార్టీల నాయకుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. 1 జనవరి 2024 నాటికి 18 ఏళ్లు నిండి ఓటరుగా నమోదు కాని వారు ఎవరైనా ఉంటే గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు.
డబుల్, చనిపోయిన వారి ఓటు హక్కు జాబితాలో లేకుండా చూడాలన్నారు. ఓటరు జాబితా తయారీ నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు తప్పులు లేకుండా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎస్ఆర్-2024 తుది ఓటరు జాబితా ఈ నెల 8న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సంబంధిత కాపీలను నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ఈవీఎం, వీవీ ప్యాట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కలెక్టరేట్, ఆర్డీ వో కార్యాలయాల్లో ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, పూజారి గౌతమి, ఆర్డీవోలు ఆనంద్కుమార్, మధుసూదన్, తహసీల్దార్ షరీఫ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ రాష్ట్రంలోనే ఉత్తమ సేవల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం హర్షణీయమని కలెక్టర్ అనురాగ్ జయంతి కొనియాడారు. 2023లో మొత్తం 79,365 మంది రోగులకు 2,54,410 వైద్య పరీక్షలు చేసినందుకుగాను ఉత్తమ సేవల విభాగంలో రాజన్నసిరిసిల్ల టీ-హబ్ ప్రథమ స్థానం పొందగా జనవరి 26న టీ-హబ్ కోఆర్డినేటర్ రాంప్రసాద్ మెమెం టో స్వీకరించారు. రాజన్నసిరిసిల్ల టీ-హబ్ సిబ్బంది శనివా రం కలెక్టర్ అనురాగ్ జయంతిని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. టీ-హబ్కు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం దక్కడంపట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేసి, ఇందుకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. ఇక్కడ ప్రభుత్వ జనరల్ దవాఖాన పర్యవేక్షకుడు సంతోష్, జిల్లా దవాఖాన పర్యవేక్షకుడు మురళీధర్రావు, వైద్యులు మనీష, శ్వేత, క్రాంతిరేఖ, కోఆర్డినేటర్ రాంప్రసాద్, హారిక, జనార్దన్, సత్యనారాయణ, శ్వేత పాల్గొన్నారు.
రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రానీయవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికా రులను నియమించిన సందర్భంగా జిల్లాలోని ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమా వేశం నిర్వహించి మాట్లాడారు. నీటి శుద్ధి మొదలు ఇంటింటికీ సరఫరా అయ్యేదాకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో తనిఖీ చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
అంతకుముందు పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మంత్రి సీతక్క, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు ములుగు జిల్లా నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 7 నుంచి 15 వరకు గ్రామాల్లో పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం హైదరా బాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తాని యా మాట్లాడుతూ కలెక్టర్లు ప్రత్యేకాధికా రులకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్, డీఆర్డీవో శ్రీనివాస్, టెక్స్టైల్ ఏడీ సాగర్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.