విద్యానగర్, సెప్టెంబర్ 12 : కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రపంచానికి అన్నం పెట్టే రైతులనే కాదు.. వైద్యాన్ని అందించే డాక్టర్లను కూడా అందించగలదని నిరూపించేలా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పా రు.
ఒకప్పుడు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటే గగనంగా ఉండే తెలంగాణాలో మెడికల్ కళాశాల ఏర్పాటు అసంభవం అన్నట్లుగా ఉండేదని గుర్తు చేశారు. రేపటి తరానికి ఆస్తిగా.. విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేస్తూ వారికి బంగారు భవిష్యత్తునందించే దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రారంభోత్సవం రోజు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన దాదాపు 25 వేల మంది ఇంటర్మీడియట్, ఎన్సీసీ, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ల విద్యార్థులతో రేకుర్తి నుంచి మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనేలా చూడాలని కోరారు.
విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, విజయవంతం చేయడానికి నోడల్ అధికారిని నియమించాలని కలెక్టర్కు సూచించారు. విద్యార్థులను తీసుకురావడం నుంచి కార్యక్రమం ముగిసిన తరువాత తీసుకువెళ్లే బాధ్యతను ఆయా కళాశాలల యాజమాన్యాలే తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ బీ గోపి, సీపీ సుబ్బారాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, టౌన్ ఏసీపీ నరేందర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, డీఆర్డీవో శ్రీలత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు పాల్గొన్నారు.
వైద్య కళాశాల సందర్శన
కొత్తపల్లిలోని మెడికల్ కళాశాలను మంత్రి గంగుల కమలాకర్ సాయంత్రం సందర్శించారు. ఈనెల 15న సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సందర్భంగా కళాశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమావేశమందిరంలో పూర్తి స్థాయిలో స్క్రీన్లు, లైట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో వైద్య విద్య కోసం పిలిప్పిన్స్, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లేవారని, ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు రావాలంటే టాప్ ర్యాంకులు వస్తేనే సాధ్యమయ్యేదని గుర్తు చేశారు. రాష్ట్రం రాకముందు కేవలం ఐదు వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని, అలాంటిది ఇప్పుడు 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, ఇక్కడి విద్యార్థులే చదువుకునేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారన్నారు. కరీంనగర్ కళాశాలలో 100 సీట్లకు 85 మంది జాయిన్ అయ్యారని, ఇందులో 10 మంది కరీంనగర్ బిడ్డలే ఉండడం గర్వకారణమన్నారు. మన బిడ్డలు మన కళ్ల ముందే వైద్య విద్యనభ్యసించడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి వెంట కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శీలం లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్ వీరారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ లలితాదేవి, మేయర్ సునీల్రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, సీపీ సుబ్బారాయుడు పాల్గొన్నారు.
వాహనాల దారి మళ్లింపు : కలెక్టర్
ఈ నెల 15న కొత్తపల్లిలోని మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా రేకుర్తి నుంచి మెడికల్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్న తరుణంలో ఆ మార్గంలో దారి మళ్లిస్తున్నట్లు కలెక్టర్ బీ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా జగిత్యాల నుంచి వచ్చే వాహనాలను వెలిచాల ఎక్స్ రోడ్డు బైపాస్ నుంచి చింతకుంట మీదుగా కరీంనగర్ వెళ్లేలా, కరీంనగర్ నుంచి జగిత్యాల మార్గంలో వెళ్లే వాహనాలను రేకుర్తి, చింతకుంట బైపాస్ మీదుగా వెలిచాల ఎక్స్ రోడ్డు మీదుగా జగిత్యాల వెళ్లేలా మళ్ల్లించనున్నట్లు చెప్పారు.