కరీంనగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ మంగళవారం సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు పరిధిలో జరిగింది. సభ నాలుగు గంటలకు జరుగుతుందని తెలిసినా.. ప్రజలు మాత్రం తండోపతండాలుగా మధ్యాహ్నం నుంచే వేదిక వద్దకు చేరుకోవడం కనిపించింది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఆయా మండలాల్లోని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఎవరికి వారే వాహనాలు సమకూర్చుకొని కదలి రావడంతో.. సిరిసిల్ల పట్టణం నలువైపులా రహదారులు గులాబీ మయమయ్యాయి.
ప్రధాన రహదారులతో పాటు.. గల్లీ రోడ్లపై సైతం గులాబీజెండాలు రెపరెపలాడాయి. సభకు నలువైపులా ఉన్న రోడ్ల నుంచి జనం భారీగా తరలి రావడంతో.. సభ ప్రారంభానికి గంట ముందే ప్రాంగణం నిండిపోయింది. దీంతో సభ బయట వేలాది మంది జనం నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొంత మంది సభాస్థలికి చేరుకునేందుకు జనంతో దారులన్నీ నిండిపోవడంతో వారి వారి వాహనాల్లోనే ఉండిపోయారు. మొత్తంగా చూస్తే సభ గ్రాండ్ సక్సెస్ అయింది.
అడుగడుగునా జోష్
సభకు తరలి వచ్చిన ప్రజల్లో అడుగడుగునా జోష్ కనిపించింది. ప్రతీ సందర్భం లోనూ ‘జై కేసీఆర్’ ‘జై కేటీఆర్’ అంటూ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. కళాకారులు పాటలు పాడుతూ మధ్య మధ్యలో ఈ ప్రాంతంలో ఎవరికి ఓటేస్తారని అడిగితే.. కారు గుర్తుకే తమ ఓటంటూ సభలోని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతోపాటు కేటీఆర్ మాట్లాడినప్పుడు.. సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘మా నాయకుడు మీరేనంటూ..’ పలువురు సభలో నుంచి నినాదాలు చేశారు. అలాగే, సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు సభికుల్లో మంచి జోష్ కనిపించింది. మీకు మూడు గంటల కరెంట్ కావాలా..? లేక 24 గంటల కరెంట్ కావాలా..? అంటూ ప్రశ్నిస్తే.. అందరూ చేతులెత్తి 24 గంటల కరెంట్ కావాలంటూ సమాధానం ఇచ్చారు. మానేరు జలధారగా మారిందా లేదా..? ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా కాదా..? చెప్పాలంటూ ప్రశ్నిస్తే.. మీరే చేశారంటూ ముఖ్యమంత్రికి సంఘీభావం పలుకుతూ నినాదాలు చేశారు. కేటీఆర్ గురించి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు.. అనేక సార్లుసభలో చప్పట్ల మోతలు వినిపించాయి. మొత్తంగా సభకు వచ్చిన ప్రజల్లో కనిపించిన జోష్, ప్రతిపక్షాలకు దడపుట్టించేలా ఉన్నది.
ఆపద మొక్కులోళ్లను నమ్మద్దు
అనేక అబద్ధాలతోటి, అనేక మోసపు మాటలతోటి ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చేవాళ్లు చాలా మంది ఉంటరు. ఒక మేరాయన ఇంట్ల బట్టలు కుడుతుండు. ఆయన సూది కిందిపడిపోయింది. ‘దేవుడా.. దేవుడా వేములవాడ రాజన్న స్వామి, నా సూది నాకు దొరుకని, నీ పేరు మీద పది కిలోల చక్కెర పంచి పెడుతాని మొక్కుతడు. ఇంట్ల ఉన్న భార్య విని, నువ్వు పది పైసల సూది కోసం.. పది కిలోల చక్కెర పంచిపెడుతవా అని అంటే.. సూదైతే దొరకని, చక్కెర ఎగవెడుదం. దేవుడు ఏం చేత్తడు అన్నడట.’ అట్లుంటది ఆపద మొక్కులు మొక్కే వాళ్ల పరిస్థితి. యాళ్లకువచ్చి ఏది పడితే, అది చేస్తామని అంటరు.
రామన్నపై ప్రసంశలు జల్లు
మంత్రి కేటీఆర్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. నేతన్నల సంక్షేమం కోసం మీ మంత్రి పట్టుబట్టి తమతో కొట్లాడారని చెబుతూనే.. ఆయన కోరిక మేరకు అనేక పథకాలను అమలు చేశామని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి వారి కుటుంబాలకు ఉపాధి దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని వివరించారు. నాటి సిరిసిల్లను నేడు ఎలా మార్చారో పోల్చి చూడాలని కోరారు. తాను మీ మంత్రిని పొడిగితే బాగుండదని, మీ నాయకుడి గురించి ఆయన గుణ గణాల గురించి తన కంటే మీకే బాగా తెలుసని చెప్పారు. అలాగే, మీ నాయకుడికి మంచి భవిష్యత్ ఉందంటూ చెప్పారు. దీంతో ‘జై కేటీఆర్’ అంటూ సభ దద్దరిల్లేలా సభికులు నినాదాలు చేశారు.
కాబోయే ఎంపీ వినోద్కుమార్
సభా వేదికపై మాట్లాడుతున్న సమయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. వేదికపై ఉన్న మాజీ ఎంపీ అంటూనే.. కాబోయే ఎంపీ ఆయనే అంటూ పేర్కొనడంతో ఒక్కసారిగా సభలో చప్పట్లు మోగాయి. ఇప్పటికే ఈ విషయాన్ని గతంలోనే కేటీఆర్ వెల్లడించగా, తాజాగా స్వయంగా కేసీఆర్ చెప్పడంతో ఎంపీగా వినోద్కుమార్ బరిలోకి దిగుతారని అందరికీ అర్థమైంది.
చల్మెడ గాలి బాగానే ఉన్నది
వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో వివరించారు. వేదికపై ఉన్న చల్మెడ లక్ష్మీ నరసింహారావును చూస్తూ.. చల్మెడ గురించి చెప్పాలా..? అంటూ.. ఇక్కడ చల్మెడ గాలి బాగానే ఉన్నదని నవ్వుతూ ప్రస్తావించారు. అలాగే, సభలో చల్మెడ అభిమానులు బాగున్నట్లున్నారు. వారందరికీ నా అభిందనలు అని చెప్పడంతో సభలో చప్పట్లు మారుమోగాయి.