పెద్దపల్లి, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ)/మంథని/కమాన్పూర్: ‘తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ఊరూరా చర్చ జరగాలి. నాటికీ నేటికీ తేడాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఈ దిశగా పార్టీ శ్రేణులు జాగృతం చేయాలి’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కమాన్పూర్, మంథనిలో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. అలాగే ‘మన ఊరు-మన బడి’ కింద 21లక్షలతో పునర్నిర్మించిన కమాన్పూర్ మండలం గుండారం ప్రభుత్వ పాఠశాలను, 6కోట్లతో మంథనిలో పట్టణంలోని బొక్కలవాగుపై నిర్మించిన బ్రిడ్జిని ఆయన ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి ఈశ్వర్ మాట్లాడారు.
స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఇప్పుడున్న వనరులే అప్పుడున్నాయని, కానీ అప్పటి పాలకుల నిర్లక్ష్యం, చేతగాని తనంతో ప్రజలకు చేరలేదన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్తోతనదైన శైలిలో పాలనందిస్తున్నారని, 65 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనను మరిపించారన్నారు. వినూత్నమైన ఆలోచనలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమాతో పాటు సాగు నీటి సరఫరా, ఉచిత కరెంట్ ఇచ్చి సాగురంగానికి దన్నుగా నిలిచారని కొనియాడారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదిగిందన్నారు. ఆనాడు 45 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే సీఎం కేసీఆర్ ముందు చూపు, ప్రాజెక్టుల నిర్మాణంతో ఒక కోటి ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా యన్నారు. నాడు కడుపు నిండా కరెంట్ ఇవ్వలేదని, తాగేందుకు నీటిని కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇందుకు భిన్నంగా నేడు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, బడులు, వైద్య శాలలు, నూతన భవనాలు నిర్మితమయ్యాయన్నారు. కేసీఆర్ ఆలోచనల ఫలితంగా అద్భుతాలు జరిగాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.
‘అన్నా అంటే.. నేనున్నా’ అని అభయమిచ్చే గొప్ప నేత మన పుట్ట మధూకర్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జడ్పీ చైర్మన్గా పెద్దపల్లి జిల్లాతోపాటు మంథని నియోజకవర్గానికి గొప్ప సేవలందుతున్నయ్. 2014కు ముందు ఉన్న ప్రభుత్వాలు మంథని నియోజకవర్గానికి చేసింది శూన్యం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసలైన అభివృద్ధి జరిగింది. మంథని నియోజకవర్గంలో రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బాలింతలకు కేసీఆర్ కిట్ ఇంకా ఎన్నో పథకాలు ఇంటింటికీ చేరువైనయ్. పల్లె, పట్టణాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రిదే. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు కూడా రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్నికలు వస్తున్నయ్ అంటే కాంగ్రెస్, బీజేపీ వైషమ్యాలను సృష్టించేందుకు కుతంత్రాలు చేస్తున్నయ్. ఎవరెన్ని కుట్రలు చేసినా మంథని గడ్డపై గులాబీ జెండాను ఎగురవేస్తం.
– బోర్లకుంట వెంకటేశ్నేతకాని, పెద్దపల్లి ఎంపీ
రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన మంథని నియోజకవర్గంలో ఎందరినో ఎదగకుండా సమాధి చేసింది దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుటుంబమే. వారి పదవులను కాపాడుకునేందుకు ద్వితీయశ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవులను ఇవ్వలేదు. శ్రీపాదరావు హయాంలో మం థని మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని నిర్మిస్తే ఆ శిలాఫలకంపై అప్పటి చైర్మన్ గొబ్బూరి సత్యంరాజు పేరు పెట్టలేదు. మంథని మార్కెట్ కమిటీని టీడీపీ హయాంలో మాజీ ఎమ్మెల్సీ గీట్ల జనార్దన్రెడ్డి మంథనికి తీసుకు వస్తే, ఆ మార్కెట్ కమిటీకి శ్రీపాదరావు పేరును పెట్టారు తప్ప గీట్ల జనార్దన్రెడ్డి పేరు పెట్టలేదు. 2014లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీకి ఆయన పేరు పెట్టడమే కాకుండా విగ్రహాన్ని కూడా నెలకొల్పాం. 35 ఏళ్లు తండ్రీ, కొడుకులు అధికారంలో ఉన్నా కట్టింది ఒక్కటే బ్రిడ్జి. అదే నేను గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో 20 బ్రిడ్జిలను కట్టించా. శ్రీధర్బాబు తన తండ్రి విగ్రహాలు, ఫొటోలు పెట్టుకోవడమే తప్ప అంబేద్కర్, జ్యోతిరావుఫూలే, జగ్జీవన్రాం, పీవీ నరసింహారావు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్నను ఒక్కనాడు గౌరవించలేదు. మంథని నియోజకవర్గంలోని ప్రజలంతా ఏకమై బీఆర్ఎస్కు అండగా నిలువాలి. అభివృద్ధి చేసే సర్కారును ఆశీర్వదించాలి.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్
నేను బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జెండా పట్టుకొని తిరిగిన. నాకు పార్టీ అనేక పదవులు ఇచ్చింది. తొలిసారిగా నామినేటెడ్ పదవి ఇచ్చింది. ఇది నాకు నిజమైన గౌరవం. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు నా కృతజ్ఞతలు. పార్టీ నాకిచ్చిన బాధ్యతకు నెరవేరుస్తూ రైతులకు మరిన్ని సేవలందిస్త. పాలకవర్గంతో కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ చేరుస్త.
– ఎక్కటి అనంతరెడ్డి, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్
ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాలు అమలు చేస్తున్నది. వీటిని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం పండుగలా చేసుకునేలా రైతులను ప్రోత్సహిస్త. కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతులందరికీ మెరుగైన సేవలందిస్త. మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎంపీ వెంకటేశ్కు నా కృతజ్ఞతలు. పార్టీ నా పై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను, నా పాలకవర్గం పని చేస్తుంది.
– దాసరి రాజలింగు, కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్