రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ సంపదను కొల్లగొట్టేందుకు విష సర్పాలు వస్తున్నాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్ నగరపాలక సంస్థలోని 20 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ చేసిందేం లేదని, వారిని నమ్మితే మళ్లీ రాష్ట్రం గుడ్డిదీపం అవుతుందని చెప్పారు. కార్యకర్తలే తమ బలం, బలగమని, వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– కార్పొరేషన్, మే 26
కార్పొరేషన్, మే 26: రాష్ట్రంలోని వచ్చే తరాల బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా. అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన అవసరమున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని కొనియాడారు. ఎన్నికల సమయంలో మళ్లీ తెలంగాణ సంపదను కొల్లగొట్టేందుకు విషసర్పాలు వస్తున్నాయని, వాటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన శుక్రవారం కరీంనగర్ నగరపాలక సంస్థలోని 20 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో చేసి చూపించామన్నారు. ఎన్నికలు వస్తున్నాయని, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, కానీ, ఈ 70 ఏళ్లు పాలించిన ఈ పార్టీలు తెలంగాణకు ఏం చేశాయని ప్రశ్నించారు. వారిని నమ్మితే మరో సారి తెలంగాణను గుడ్డి దీపం చేస్తారని విమర్శించారు.
రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎలా ఉందో..? సీఎం కేసీఆర్ పాలనలో ఇప్పుడు ఏ స్థాయిలో అభివృద్ధి సాధించిందో..? ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కరీంనగర్లో రోడ్లన్నీ గుంతలు పడి అధ్వానంగా ఉండేవని, పక్కనే మానేరు డ్యాం ఉన్నా తాగునీటికి మహిళలు ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. గతంలోని సమైక్యపాలకులు నగరాభివృద్ధికి రూ.కోటి కూడా ఇవ్వలేదన్నారు. కానీ, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఒకేసారి 500 కోట్ల నిధులు మంజూరు చేసి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రోడ్లు, మురుగుకాలువల నిర్మాణంతోపాటు ప్రతి రోజూ తాగునీరు అందిస్తున్నామన్నారు. నగరానికి తలమానికంగా ఉండేలా కేబుల్బ్రిడ్జిని అభివృద్ధి చేశామని, వచ్చే ఆగస్టులో మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశను ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలో పర్యాటక ప్రాంతంగా కరీంనగర్ నిలుస్తుందన్నారు. మెడికల్ కళాశాల, టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇతర ప్రదేశాల నుంచి కరీంనగర్కు వచ్చే వారందరూ ఆశ్చర్యపడే స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలను నమ్మితే తెలంగాణ బొగ్గు, కరెంటు, నీళ్లు దోచుకుపోతారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ల పాలనకు ఢీల్లీలో రిమ్రోట్ ఉంటుందని, ఆ రిమోట్తో తెలంగాణ సంపదను ఇతర రాష్ర్టాలకు తరలిస్తారని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, శాంతి లేకపోతే అభివృద్ధి జరగదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడి పని చేసేది, నిలబడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
తెలంగాణలోని సంపదను దోచేందుకు విపక్షాలు కుట్రలు పన్నుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం సంపదను ప్రజలకు పంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇంటి పార్టీ అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. పార్టీకి అండగా ఉండి వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ గొప్పగా ఆదరణ ఉందని, ప్రజలు అండగా ఉంటారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు అడ్డగోలుగా ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని హితవుపలికారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధికి, సంక్షేమానికి ఓటేసినట్లేనని చెప్పారు. ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మధు, కార్పొరేటర్లు సుధగోని మాధవి కృష్ణగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, బండారి వేణు, గంట కళ్యాణి శ్రీనివాస్, భూమాగౌడ్, ఎడ్ల సరిత అశోక్, నక్క పద్మ, అర్ష కిరణ్మయి మల్లేశం, కుర్ర తిరుపతి, జంగిలి సాగర్, బీఆర్ఎస్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, ప్రశాంత్రెడ్డి, మేచినేని అశోక్రావు, శ్రీనివాస్రెడ్డి, ఒంటెల సత్యనారాయణరెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రజల్లో చర్చ పెట్టాలి. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలి. కరీంనగర్ను అభివృద్ధ్దిలో ముందంజలో ఉంచాం. మంత్రి కేటీఆర్ విదేశాల పర్యటన చేసిన ప్రతి సమయంలో అనేక కార్పొరేట్ సంస్థలను పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన కేటీఆర్ 42 వేల ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీల పెట్టుబడులను తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్ను ఢీ కొట్టే స్థాయి కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి కూడా తీసుకురాలేదు.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్
ప్రజా సంక్షేమమే ధ్యేయం
రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నది. ఈ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎక్కడికక్కడ ఖండించాలి. కార్యకర్తల బలంతోనే పార్టీ ముందుకు సాగుతున్నది. అన్ని సమయాల్లోనూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న పథకాలను ప్రజలకు వివరించాలి. ప్రతి ఒక్కరూ విపక్షాలు చేస్తున్న నిరాధార విమర్శలను తిప్పికొట్టాలి.
– నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్సీ
అండగా నిలువాలి
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 4 లక్షలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కరీంనగర్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరుగనంత అభివృద్ధి ఈ తొమ్మిదేళ్ల పాలనలో జరిగింది. అన్ని రోడ్లను సుందరంగా తీర్చిదిద్ది ఎక్కడా సమస్యలు లేకుండా చేశాం. అనునిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు గంగుల కమలాకర్. ప్రతి ఒక్కరూ మంత్రికి అండగా నిలవాలి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
– చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు
బీఆర్ఎస్తో పోటీ పడే పార్టీలు లేవు
అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడే పార్టీలు రాష్ట్రంలో లేవు. అభివృద్ధిలో పోటీ పడలేక విపక్షాలు తప్పుడు ప్రచారాలతో ప్రజ ల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేవ లం అధికారం కోసం విచ్ఛిన్నకర పరిస్థితులు సృష్టించే యత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ ప్రజలు గర్వపడేలా అభివృద్ధి చేస్తున్నాం. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలైనా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది. కానీ, బీఆర్ఎస్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.
– యాదగిరి సునీల్రావు, నగర మేయర్
పథకాలను వివరించాలి
రాష్ట్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నది. వారి సంక్షేమం అనేక కార్యక్రమాలను చేపడుతున్నది. సీఎం కేసీఆర్ కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నారు. నియోజకవర్గంలో మంత్రి గంగుల అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
– చల్ల స్వరూపరాణి, నగర డిప్యూటీ మేయర్