వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశాలల్లో బోధనకు శ్రీకారం చుట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి వర్చువల్ విధానంలో ఒకే సారి ప్రారంభించగా, ఉమ్మడి జిల్లా చరిత్రలో నూతన అధ్యాయం ఆరంభమైంది. రామగుండం, జగిత్యాల మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, 2023-24 వైద్య విద్యా సంవత్సరంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ కళాశాలలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది. తద్వారా ప్రభుత్వ పరంగా నాలుగు కాలేజీల్లో కలిపి 600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఉన్న రెండు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 400 సీట్లున్నాయి. మొత్తంగా చూస్తే రాబోయే వైద్య విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు కలిపి వేయి సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లా నుంచి బయటకు వెళ్లి మెడిసిన్ చేయాలనుకునే వారికి కష్టాలు తప్పనున్నాయి. అంతేకాదు, మున్ముందు ప్రభుత్వ వైద్యశాలల్లో మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. సీఎం చూపుతున్న చొరవపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేవలం ఒకే ఒక మెడికల్ కళాశాల మంజూరు చేయాలని కొన్ని సంవత్సరాల పాటు జిల్లా ప్రజలు ఆందోళనలు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అయినా, సమైక్య ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. ఇదిగో అదిగో అంటూ.. చెప్పుకొచ్చారే తప్ప.. కళాశాల ఇవ్వలేదు. కనీసం సింగరేణి ప్రాంతంలోనైనా ఒక మెడికల్ కళాశాల ఇవ్వాలని పదే పదే కోరినా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాల అనేది సమైక్య రాష్ట్రంలో కలగానే మారిపోయింది. కానీ, స్వరాష్ట్రంలో జిల్లాలో మెడికల్ కాలేజీ దిశగా అడుగు పడింది.
లాంఛనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు
జగిత్యాల అర్బన్/ ఫర్టిలైజర్సిటీ, నవంబర్ 15 : జగిత్యాల, రామగుండం మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించగా, రెండు చోట్ల ఆరంభ కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో స్క్రీన్ ఏర్పాటు చేయగా కలెక్టర్ జీ రవి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, తదితరులు జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం వారు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కళాశాల ప్రిన్సిపాల్ శివరాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డేవిడ్, సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డీఎంహెచ్వో డాక్టర్ శ్రీధర్, ఆర్డీవో మాధురి, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, బాసర త్రిబుల్ఐటీ డాక్టర్ సతీశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రామగుండం కళాశాలలో ఏర్పాటు చేసిన లైవ్ టెలీకాస్ట్లో పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, మేయర్ డాక్టర్ అనిల్కుమార్, ప్రిన్సిపాల్ హిమబిందుతో పాటు ఉన్నతాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తిలకించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఇక్కడ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కొలిపాక సుజాత, దాతు శ్రీనివాస్, ఎండీ రఫీక్, పెంట రాజేశ్, క్రిష్ణవేణి, బాలరాజ్కుమార్, బొడ్డు రవీందర్, అడ్డాల గట్టయ్య, ముస్తాఫా, పొన్నం లక్ష్మణ్, మేకల సదానందం, అడ్డాల స్వరూప, గాదం విజయ తదితరులు ఉన్నారు.
జగిత్యాల: సీఎం ప్రసంగాన్ని తిలకిస్తున్న విద్యార్థులు
నూతన అధ్యాయం
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ముందుగా ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తూ వచ్చారు. సదరు దవాఖానలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వచ్చారు. కరోనా వంటి మహమ్మారి వచ్చినా.. తట్టుకొని నిలిచేలా రోగులకు సేవలు అందించేలా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దారు. అందుకే ఇటీవల కరోనా రక్కసి కాటుకు బలికాకుండా ఎంతో మంది పేదలకు సర్కారు దవాఖానలు సేవలందించాయి. వీటితోపాటు కేసీఆర్ కిట్ను అమలు చేస్తూ ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచుతున్నారు. ఈ పద్ధతిలో పేదల కుటుంబాలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి అప్పుల పాలుకాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఒకవైపు ఈ కార్యక్రమాలు చేపడుతూనే.. కరోనా నేర్పిన అనేక అనుభవాలు, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సమూల మార్పులు, పెరుగుతున్న ప్రజలు, వారికి అనుగుణంగా లేని వైద్యులు, పలు వైరస్లు సవాలు విసురుతున్న సమయంలో వైద్యుల అవసరం, ఆవశ్యకత వంటి అంశాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైద్య కళాశాలలపై దృష్టిపెట్టారు.
నిజానికి ఒక మెడికల్ కాలేజీ పెట్టి.. అందుకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి పొందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన కళాశాలలు నిర్మాణం చేసి.. అనుమతులు సాధించింది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లా రామగుండలో మంగళవారం నుంచి వైద్య కళాశాలలు ఆరంభమయ్యాయి. ముఖ్యమంత్రి స్వయంగా హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కాగా, రాజన్న సిరిసిల్లతోపాటు కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాల ప్రభుత్వం మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కళాశాల పనులు వడివడిగా సాగుతున్నాయి. కరీంనగర్లో ప్రారంభం కావాల్సి ఉన్నది. 2023-24 వైద్య విద్యా సంవత్సరం నాటికి ఈ రెండు మెడికల్ కళాశాలలు కూడా పూర్తవుతాయని భావిస్తున్నారు. పెద్దపల్లి, జగిత్యాల కళాశాలకు 150 చొప్పున 300 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్లోనూ అదే పద్ధతిలో సీట్లు ఉండనున్నాయి. నాలుగు జిల్లాల్లో మెడికల్ కళాశాలలను ప్రారంభిస్తే 600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే కరీంనగర్ జిల్లాలో ప్రతిమ, చల్మెడ ఆనందరావు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 200 చొప్పున 400 సీట్లున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటుతో కలిసి చూస్తే వీటి సంఖ్య ఉమ్మడి జిల్లాలో వెయ్యికి చేరనున్నాయి.
తప్పనున్న ఇబ్బందులు
గతంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు కొరత ఉండడంతో ఔత్సాహిక విద్యార్థులు చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లి లక్షలు పెట్టి చదువుకుంటున్నారు. ఈ తరహా చదువు వ్యవహారంలో చాలా మంది మోసపోతున్నారు. అంతేకాదు. క్వాలిటీ విద్య కూడా అందడం లేదు. నిజానికి ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే విదేశాలకు వెళ్లి ఏటా ఎంబీబీఎస్ చేస్తున్న వారి సంఖ్య మూడు నుంచి నాలుగు వందల వరకు ఉంటుందని అంచనా. ఇక నుంచి ఔత్సాహిక విద్యార్థులు విదేశాలకు వెళ్లి వ్యయ ప్రయాసలకు గురికావాల్సిన అవసరం ఉండదు. దర్జాగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. వైద్యులు పెరగడం ద్వారా జిల్లాల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లభిస్తాయి. ఎక్కువ మంది వైద్య విద్యలో చేరడానికి అవకాశాలు మెరుగవుతాయి.
కళాశాలకు 30 ఎకరాలు కేటాయించాం
జగిత్యాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ కేబినెట్ ప్రకటించగానే జిల్లాలో కళాశాల ఏర్పాటుకు స్థలం కేటాయింపును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నాం. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేసేలా స్థలాన్ని సైతం సీఎం కేసీఆరే స్వయంగా ఎంపిక చేశారు. ఎస్సారెస్పీకి చెందిన 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ప్రజలకు సేవ చేయడమనే లక్ష్యాన్ని మరువద్దు. వైద్య విద్యను అభ్యసించి తమ కలను సాకారం చేసుకోవాలి. కళాశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఒకేసారి ఎనిమిది మెడికల్ కళాశాలలు ప్రారంభం కావడం, అందులో జగిత్యాల సైతం ఉండడం సంతోషకర విషయం.
– జీ రవి, జగిత్యాల కలెక్టర్
ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు
ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభం కావడంతో ఆరోగ్య తెలంగాణ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పేద విద్యార్థులను వైద్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నది. వైద్య రంగంలో గత ఆరున్నర దశాబ్దాల్లో సాధ్యం కానిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనిమిదేండ్లలోనే రికార్డులు బ్రేక్ చేసేలా ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ఒక వైపు విద్య.. మరోవైపు మెరుగైన వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మెడికల్ కళాశాలను ప్రారంభించి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్
ఉత్తమ డాక్టర్లుగా తయారుకావాలి
రామగుండం మెడికల్ కళాశాలలో అన్ని రకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. అనుభవం గల అధ్యాపకులు ఉన్నారు. విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని మంచి డాక్టర్లుగా తయారు కావాలి. కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మొదటి దఫాలో 97 సీట్లు కేటాయించారు. విద్యార్థులకు వసతి సౌకర్యం కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు. సౌకర్యాలను వినియోగించుకొని ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలి.
బాగా చదివి సేవలందించాలి.
– డాక్టర్ సర్వే సంగీతా సత్యనారాయణ, పెద్దపల్లి కలెక్టర్
గొప్ప ఆలోచనకు నిదర్శనం
ఎన్నో ఆశలతో నూతన కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులు బాగా చదివి ప్రజలకు సేవలు అందించాలి. రాష్ట్ర ఏర్పాటుతోనే వైద్యవిద్య కళాశాలలు ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప ఆలోచనకు నిదర్శనం. విద్యార్థులందరూ ప్రభుత్వానికి అండగా ఉండాలి.
– డాక్టర్ అనిల్కుమార్,
రామగుండం మేయర్ వైద్య వృత్తిలో రాణించాలి
రాష్ట్ర ప్రభుత్వం నూతన కళాశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా తరగతులు ప్రారంభించడం హర్షనీయం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వైద్య వృత్తిలో రాణించాలి. మొదటి విడుత కౌన్సెలింగ్లో 150 సీట్లు కేటాయించగా 97 మంది అడ్మిషన్ తీసుకున్నారు.
– హిమబిందు, రామగుండం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు
వైద్యకళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రగతి భవన్లో మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన వైద్య కళాశాలల వర్చువల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ కాలేజీని ప్రారంభించి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. – మెట్పల్లి/ జగిత్యాల రూరల్, నవంబర్ 15
ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల రూరల్, నవంబర్ 15 : మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను కలిసి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలుపుతున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్