కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన నియోజకవర్గ హెడ్క్వార్టర్స్లో ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. మాస్కులు ధరించాల్సిందిగా ప్రజలను కోరకుండా తానే మాస్కులు అందజేస్తున్నారు. పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ఎవరైతే మాస్కులు లేకుండా కనిపించారో వారికి స్వయంగా మాస్కులను తొడిగారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సెకండ్ వేవ్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ ఫేస్ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించాలన్నారు. లక్షణాలు బయటపడేంతవరకు చెక్ చేసుకునేందుకు మరోమార్గం లేదన్నారు. కావునా అందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. 45 ఏళ్ల పైబడిన వారంతా అప్రమత్తంగా ఉండి కొవిడ్ వాక్సిన్ తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.