కొత్తపల్లి, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. కొత్తపల్లి మండలంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 8 పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ క్రమంలో మండలంలోని చింతకుంట యూపీఎస్లో ప్రహరీ, బాత్రూం, భవనానికి రంగులు, మరుగుదొడ్లకు మరమ్మతులు, బ్లాక్బోర్డులు, నల్లాలు, పాఠశాల గోడలపై అందమైన బొమ్మలు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మేజర్, మైనర్ వర్క్ కింద దెబ్బతిన్న తలుపులు, కిటికీల స్థానంలో కొత్తవి అమర్చారు. పాఠశాల ఆవరణలో సంపు నిర్మాణంతో పాటు టాయ్లెట్స్ ఆధునీకరించారు. తరగతి గదుల్లో కరెంట్ వైరింగ్ చేయించారు. అలాగే, కార్యాలయంతో పాటు ఆరు గదులకు రంగులు వేయించి పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలో వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు
మండలంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 8 పాఠశాలల్లో ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. చింతకుంట యూపీఎస్ను రూ. 20 లక్షలతో అభివృద్ధి చేసినం. పాఠశాలకు ప్రహరీ, మరుగుదొడ్లకు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, తరగతి గదులకు రంగులు, తదితర పనులు చేపడుతున్నం. మండలంలోని పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేస్తాం.
– శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో, కొత్తపల్లి