– పదవీ విరమణ సందర్భంగా ఏరియా వర్క్షాప్లో భావోద్వేగ వీడ్కోలు
– నిబద్ధతతో పనిచేస్తేనే సింగరేణి మరింత ముందుకు సాగుతుంది : జీఎం శాలెం రాజు
రుద్రంపూర్, జూలై 27 : ప్రతి ఉద్యోగి సమిష్టి కృషి, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహిస్తేనే సింగరేణి సంస్థ భవిష్యత్లో మరింత బలోపేతం అవుతుందని, సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం .శాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా సోమవారం ఏరియా వర్క్షాప్లో అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించి భావోద్వేగ వీడ్కోలు పలికారు. వర్క్షాప్ డీజీఎం జొన్నలగడ్డ క్రిస్టఫర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాలెం రాజు సేవలను కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. వక్తలు మాట్లాడుతూ అండర్ మేనేజర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన శాలెం రాజు క్రమంగా ఉన్నత పదవులను అధిరోహిస్తూ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుని ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. కొత్తగూడెంలో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి, అదే ప్రాంతంలో ఉద్యోగంలో చేరి, చివరకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేస్తున్న తొలి అధికారిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శాలెం రాజు మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర వారి కృషి కూడా ఉంటుందని అంకితభావంతో పని చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చు అన్నారు. ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ మాట్లాడుతూ, శాలెం రాజు పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రామకృష్ణ, ఎస్వోటూ జీఎం గోవిందరావు, ఇంజినీర్లు బి.శంకర్, టి.అనిల్, ఏ.ఉపేందర్ బాబు, రవికుమార్, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.డి.సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మధుకృష్ణ, బ్రాంచ్ సెక్రటరీ మెంగని అశోక్, సూపర్వైజర్లు బి.వెంకట్రాం, యు.రమేష్బాబు, రోషన్, తారాచంద్, ఎస్.డి.యాకుబుద్దీన్, కరుణాకర్, జాన్ కెనడీ, వెంకటదుర్గతో పాటు అధికారులు, నాయకులు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం