సిరిసిల్ల సెస్ చైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది నుంచి మంత్రి కేటీఆర్కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన రెండో సారి చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1995 నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రామన్న, అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించడమే కాదు ఆది నుంచీ అమాత్యుడి వెంట నడిచారు. మొదట సింగిల్ విండో చైర్మన్గా ఎన్నికై, తర్వాత 2007లో సెస్ చైర్మన్గా, తాజాగా మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తంగా తన 27 ఏండ్ల రాజకీయ జీవితంలో చెరగని ముద్రవేసుకున్నారు.
సెస్ చైర్మన్గా అవకాశం కల్పించిన మంత్రి కేటీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని నిలబెడతా. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ సమప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. గతంలో పనిచేసిన అనుభవంతో సెస్ను మంచి మార్గంలో నడిపిస్తా. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తా. ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తా. ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకొని త్వరలోనే పరిష్కరిస్తా. రాబోయే రోజుల్లో పాలకవర్గం, అందరి సహకారంతో సంస్థను లాభాల్లోకి తీసుకెళ్తా. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరికీ సరైన సమాధానం చెబుతా. నా విజయానికి కృషిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా.
– చిక్కాల రామారావు, సెస్ చైర్మన్
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 27: తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్కు చెందిన చిక్కాల రామారావు అంచలంచెలుగా ఎదుగుతున్నారు. మంత్రి కేటీఆర్కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1995లో కస్బెకట్కూర్ సింగిల్విండో చైర్మన్గా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రైతులకు మెరుగైన సేవలందించారు. తర్వాత 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో చేరి, ఉద్యమంలో ముందుండి కొట్లాడారు. క్రియాశీలక పాత్ర పోషించారు. 2007లో సిరిసిల్ల రూరల్ సెస్ డైరెక్టర్గా పోటీ చేసి, గెలుపొందారు. సెస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల పాటు పనిచేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ 2009లో రాజకీయ ఆరంగ్రేటం చేయడంతో సిరిసిల్ల నుంచి పోటీచేయాలని పట్టుపట్టి తీసుకువచ్చారు. అప్పటి నుంచి మంత్రి కేటీఆర్కు విధేయుడిగా ఉంటూ ముందుకుసాగుతున్నారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులను ఏ మాత్రం ఆశించకుండా పార్టీ కోసం పనిచేశారు. 2018లో వెలమ సంక్షేమ మండలి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత 2020లో రెండోసారి వెలమ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై, కొనసాగుతున్నారు.
అప్పుడు, ఇప్పుడూ చరిత్రే..
చిక్కాల సేవలను గుర్తించిన మంత్రి కేటీఆర్, సిరిసిల్ల సెస్లో మరోసారి అవకాశం ఇచ్చారు. తంగళ్లపల్లి సెస్ డైరెక్టర్గా చిక్కాల రామారావును బరిలో నిలిపారు. మంత్రి కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న చిక్కాల రామారావు 2,545 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రామారావు సెస్ చైర్మన్గా గతంలో చేసిన అనుభవాన్ని గుర్తించి మరోసారి చైర్మన్గా అవకాశం కల్పించడంతో ఏకగ్రీవంగా చైర్మన్ ఎన్నికయ్యారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అప్పటి కాంగ్రెస్ హయాంలో 2007లోనే టీఆర్ఎస్ తరపున తొలి సెస్ చైర్మన్గా ఎన్నికైన ఆయన, తాజాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భావం తర్వాత కూడా తొలి సెస్ చైర్మన్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న ఆయన, 27 ఏండ్ల రాజకీయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.
మరోసారి తంగళ్లపల్లివాసికే చైర్మన్ స్థానం
సిరిసిల్ల సెస్ చైర్మన్ పదవి తంగళ్లపల్లి మండలానికే ఆనవాయితీగా వస్తున్నది. మంత్రి కేటీఆర్ సైతం తంగళ్లపల్లికి ఆది నుంచీ సముచిత స్థానం కల్పిస్తున్నారు. తంగళ్లపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే జువ్వాడి నర్సింగరావు సెస్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. తర్వాత 2007లో చిక్కాల రామారావు సిరిసిల్ల రూరల్ డైరెక్టర్గా గెలుపొంది, చైర్మన్గా ఎన్నికయ్యారు. తర్వాత 2016లో జరిగిన సెస్ ఎన్నికల్లో తంగళ్లపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది దొర్నాల లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చారు. తాజాగా మరోసారి తంగళ్లపల్లి సెస్ డైరెక్టర్గా గెలుపొందిన రామారావుకు మరోసారి చైర్మన్గా అవకాశం రావడం గమనార్హం.