జగిత్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ధరూర్ క్యాంపులోని 27.08 ఎకరాల సువిశాల స్థలంలో కళాశాల, అనుబంధంగా ప్రధాన దవాఖాన నిర్మాణానికి ఇప్పటికే 119 కోట్లు మంజూరు చేసింది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.
– జగిత్యాల, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకుసాగుతున్నారు. ఆ మేరకు 2018 డిసెంబర్లో జగిత్యాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు 2021లో మంజూరు చేసి, 1001 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు అనుమతి ఇచ్చారు. ధరూర్ క్యాంపులో 27 ఎకరాలను మెడికల్ కాలేజీకి కేటాయించారు. 11 కోట్లతో భవనాల మరమ్మతులను పూర్తి చేశారు. కళాశాలకు అనుబంధంగా 330 బెడ్స్ దవాఖానకు మంజూరు చేసి తాత్కాలిక భవనంలో ప్రారంభించారు.
ఈ యేడాది మే 7న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దవాఖానను ప్రారంభించారు. నవంబర్ 15న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి వర్చువల్ విధానంలో 150 మంది విద్యార్థులతో మెడికాలేజీ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించారు. అయితే తాత్కాలిక భవనంలో మెడికల్ కాలేజీ, అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయి భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 119 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనున్నారు. దాదాపు రెండెకరాల్లో మెడికల్ కాలేజీ, అరెకరంలో విద్యార్థుల క్యాంపస్, మరో అరెకరంలో బాలుర క్యాంపస్, దాదాపు నాలుగు ఎకరాల్లో అనుబంధ సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టనున్నారు.