రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఏడేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలకు రాజన్న జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈనెల 24న జరుగనున్న ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కోఅపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలుండగా అందులో 3 రిజర్వేషన్ కాగా, 12 జనరల్గా ప్రకటించింది. సిరిసిల్ల టౌన్1, వేములవాడ టౌన్ 1 మహిళ, బోయినిపల్లి మండలం ఎస్సీ జనరల్ స్థానాలు అయ్యాయి. కాగా వీర్నపల్లి, తంగళ్లపల్లి, రుద్రంగి, వేములవాడ రూరల్ డైరెక్టర్ స్థానాలు కొత్తగా చేశారు.
ఎట్టకేలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఉత్కంఠకు తెరపడింది. సెస్ పరిధిలో మొత్తం లక్షా 30 వేల పైచిలుకు ఓటర్లు ఉండగా, 87,130 మంది మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 42,870 మంది సభ్యులు విద్యుత్ బకాయిలున్నందున వారికి ఓటు వేసే అర్హత తొలగించారు. బకాయిలున్న సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కూడా లేకుండా పోయింది.