రైస్ మిల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కత్తి గట్టింది. ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకోవాల్సిన కేంద్రం 2020-21 నుంచే కొర్రీలు పెడుతున్నది. గత వానకాలం, యాసంగి సీజన్ల నుంచైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నది. వానకాలంలో ఒక్క కరీంనగర్ జిల్లాకు సంబంధించే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంది. కానీ, గత యాసంగిలో వచ్చిన ధాన్యం నుంచే ఇప్పటి వరకు ఒక్క బియ్యం గింజ కూడా తీసుకోలేదు. ఫిబ్రవరి నుంచే సీఎంఆర్ తీసుకోవడం నిలిపివేసిన కేంద్రం గత మే, జూన్లో ఒక్కో మిల్లు నుంచి 2-3 ఏసీకేల బియ్యం మాత్రమే తీసుకుని చేతులు దులుపుకున్నది. దీంతో మిల్లర్లు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. కరెంట్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించలేక పోతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు నష్టాల్లో ఉన్న మిల్లర్లకు ఆరుబయట భద్రపర్చిన ధాన్యం తడిసి మరింత నష్టాల్లోకి నెట్టేస్తుండగా, సకాలంలో సీఎంఆర్ బియ్యం తీసుకుంటే తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని మిల్లర్లు వాపోతున్నారు.
కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ సకాలంలో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోకపోవడంతో రైస్ మిల్లులు కుదేలవుతున్నాయి. ఐదు నెలల కాలం లో కరీంనగర్ జిల్లాలో మే నుంచి జూన్ 7 వరకు ఒక్కో మిల్లర్ ద్వారా 2 నుంచి 3 ఏసీకేల బియ్యం మాత్రమే తీసుకున్న ఎఫ్సీఐ 2020-21 యాసంగి నుంచి తీసుకోవాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఇప్పటి వరకు తీసుకోవడం లేదు. ఆ సీజన్లో ఇప్పటికి 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా ఎఫ్సీఐ తీసుకోవడం లేదు. ఇక 2021-22 వానకాలం సీజన్లో ఇంకా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ తీసుకోవాల్సి ఉంది. గత యాసంగిలో అయితే బాయిల్డ్ రైస్ తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసినా మొండి ప్రభుత్వం దిగిరాలేదు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసి మి ల్లర్లకు అప్పగించింది. 3,02,682.400 మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి సుమారు 2.00 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ తీసుకోవాల్సి ఉంది. గత వానకాలం సీజన్లో వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి బియ్యంగామార్చి పెట్టిన నిల్వలే పెద్ద మొత్తంలో గోదాముల్లో మూలుగుతున్నాయి. అవి తీసుకుంటేగానీ యాసంగి ధాన్యాన్ని మరాడించే పరిస్థితి లేదని మిల్లర్లు వాపోతున్నారు.
తడిసి మొలకెత్తుతున్న ధాన్యం
గత ఫిబ్రవరి నుంచి మిలర్లు మరాడించిన బియ్యాన్ని తమ గోదాముల్లోనే నిల్వ చేసుకున్నారు. ఇవి ఖాళీ కాకుండానే యాసంగి సీజన్ ధాన్యం మిల్లులకు చేర్చారు. జిల్లాలో 170కి పైగా ఉన్న మిల్లుల్లో దాదాపు అన్ని చోట్లా గోదాముల సరిపోక యాసంగి ధాన్యాన్ని ఆరుబయటనే భద్రపర్చారు. ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత మిల్లర్లదే బాధ్యత ఉంటుంది. గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆరుబయట భద్రపర్చిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే ఒక్క మిల్లులో 20 నుంచి 30 శాతం ధాన్యం తడిసినట్లు తెలుస్తోంది. తడిసిన ధాన్యం మొలకెత్తి పూర్తిగా పాడువుతోందని మిల్లర్లు వాపోతున్నారు. మిల్లులో ఉన్న బియ్యం కూడా దెబ్బతింటున్నదని, ఎఫ్సీఐ తీసుకునేందుకు ముందుకు వచ్చిన తర్వాత నాణ్యతలో లోపం ఉందని కొర్రీలు పెట్టే ప్రమాదం ఉందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లులు నడవని పరిస్థితి
కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించక పోవడంతో మిల్లులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. నిర్వహణ కూడా భారంగా మారింది. మిల్లుల్లో పని చేసే ఇతర రాష్ర్టాల కార్మికులు ఉపాధి లేక సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక ఆపరేటర్లు, గుమస్తాలకు నెల నెలా వేతనాలు చెల్లించక తప్పడం లేదు. కరెంటు బిల్లులు తడిసి మోపడవుతున్నాయి. వేతనాలు, కరెంటు బిల్లుల కింద బాయి ల్డ్ మిల్లర్లు అయితే, నెలకు రూ.1.50 లక్షల వరకు, రా రైస్ మిల్లర్లు అయితే రూ.లక్ష వరకు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పోషక విలువల బియ్యం మరాడించాలని పెట్టిన ఆంక్షలకు అనుగుణంగా రూ.60 లక్షలు వెచ్చిం చి సార్టెక్స్ మిషన్లు, మరో రూ.10 లక్షలతో ఎఫ్ఆర్కే మిషన్లు బిగించుకున్న మిల్లర్లు చాలా మం ది ఉన్నారు. చాలా మంది బ్యాంకు ల్లో అప్పులు తెచ్చుకుని వీటిని బిగించుకున్నారు. ఇటు బ్యాంకుల్లో అప్పులు, అటు సిబ్బంది, నిర్వాహ కులకు వేతనాలు, కరెంట్ బిల్లులు చెల్లించ లేక మిల్లర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీనికి తోడు భారీ వర్షాలతో తడుస్తున్న ధాన్యం మిల్లర్లను నష్టాల్లోకి నెడుతోంది. ఈ పాపమంతా కేంద్ర ప్రభుత్వానిదేనని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.