తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పల్లె, గ్రామం, పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే స్థలాలను ముగ్గులు వేసి అందంగా ముస్తాబు చేశారు. ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి, నీళ్లు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఏటా విజయవంతంగా నిర్వహిస్తుండడంతో పచ్చదనం పెరిగిందని ఈ సందర్భంగా వారు వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. కాగా, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, గంగాధర మండలకేంద్రంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్ పట్టణంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొని మొక్కలు నాటారు.
– కరీంనగర్, జూన్ 19(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 19(నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా హరితోత్సవం జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ప్రతి పల్లె, గ్రామం, పట్టణాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి, నీళ్లు పోసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా మొక్కలు నాటే ప్రాంతాలను ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కల ప్రాముఖ్యతను, పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. కాగా, కరీంనగర్లోని తీగల వంతెన వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావుతో కలిసి మొక్కలు నాటారు.
అక్కడి నుంచి పద్మనగర్లోని పశుగణాభివృద్ధి సంస్థ వద్ద కూడా మొక్కలు నాటి, అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మొక్కలు నాటుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కొత్తపల్లి పట్టణంలో జరిగిన హరితోత్సవంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పాల్గొన్నారు. గంగాధర మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నర్సరీలో మొక్కలను పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా కాపాడుతున్న వన సంరక్షకులను ఘనంగా సన్మానించారు. హుజూరాబాద్ పట్టణంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మొక్కలు నాటారు. మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లిలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో జడ్పీ సీఈవో ప్రియాంక, ఎంపీపీ కేతిరెడ్డి వనిత మొక్కలు నాటారు. అలాగే, ప్రతి గ్రామంలో హరితోత్సవం ఉత్సాహంగా సాగింది.